మిస్సింగ్ మిస్టరీ | Cases of missing women on the rise in Visakhapatnam | Sakshi
Sakshi News home page

మిస్సింగ్ మిస్టరీ

May 25 2025 2:57 AM | Updated on May 25 2025 2:57 AM

Cases of missing women on the rise in Visakhapatnam

విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు 

4 నెలల్లో 175 మంది మాయం 

ఇప్పటి వరకు 133 మంది ఆచూకీ లభ్యం 

మిస్టరీగానే 42 మంది మహిళల అదృశ్యం 

ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబకలహాలే కారణం 

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తియ్యని మాటలకు ప్రే‘మాయ’లో పడిపోయి ఒకరు..వివాహేతర సంబంధంతో పిల్లలను తీసుకొని మరొకరు.. తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా విశాఖలో వరుసగా మహిళల అదృశ్య సంఘటనలు కలవరం రేపుతున్నాయి.దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికలనుంచి వివాహితుల వరకు వయోభేదాలు లేకుండా కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

వీరి కోసం కుటుంబ సభ్యులు.. సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.   

విశాఖ సిటీ: విశాఖ నగరంలో మహిళల అదృశ్యాలకు ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. 

అలాగే మధ్య వయసు్కలైన మహిళలు కూడా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్‌ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇది నగరంలో పెరుగుతున్న ఆందోళనకరమైన ధోరణిగా మారింది. 

175 మంది మాయం 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిస్సింగ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు రాగా.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం విశాఖ పరిస్థితికి అద్దం పడుతోంది. జనవరిలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్‌లో 46 మంది అదృశ్యమయ్యారు.

వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీరు ప్రేమ, ఇతర కారణాలతో కావాలనే వెళ్లిపోయారా? లేదా ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మిస్సింగ్‌ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.  

పోలీసులకు సవాల్‌ 
వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో పోలీసులకు కూడా చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement