ఆయన మృతి ఉత్తరాంధ్రకు తీరనిలోటు

Avanthi Srinivas Expressed Condoles Over Death Of Vangapandu - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వంగపండు ప్రసాదరావు సాంస్కృతిక రంగానికి ఓ ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యం భౌతికంగా దూరం కావడం బాధాకరం. వంగపండు పాటలోనే సామాజిక చైతన్యం ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

గుంటూరు: ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. వంగపండు మృతికి మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లా వాసి కావడం తెలుగువారికి గర్వకారణమన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత)

తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో వంగపండు ప్రజల్లో చైతన్యం నింపారని, దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడని తెలిపారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ఉర్రూతలూగించి.. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఒక మేరుశిఖరంగా వంగపండు నిలిచిపోతారని లక్ష్మణరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర గళం వంగపండు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. వందలాది జానపద గేయాలతో అయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారని వంగపండు కుటుంబ సభ్యులకు లక్ష్మణరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top