సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్సీపీలో చేరారు.
ఈ సందర్భంగా మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజలను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సమర్థంగా, అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ ప్రస్థానం తమను ఎంతగానో ఆకర్షించాయని మండవ గౌతమ్, మండవ లక్ష్మీ నీరజ వెల్లడించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. మండవ గౌతమ్ పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడిగా, నియోజకవర్గ టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలం సొసైటీ అధ్యక్షుడిగా, పొన్నూరు మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మండవ లక్ష్మీ నీరజ టీడీపీ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీపై పోటీ చేశారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతోపాటు స్థానిక పార్టీ నాయకులు గుంటుపల్లి అంజయ్య, వేజండ్ల శివకృష్ణ, నూతలపాటి కృష్ణ, కిలారి రమేష్, త్రిపురనేని వెంకటస్వామి, రావిపాటి పవన్, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


