ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు
నోటిఫికేషన్ల విడుదలకు అనుమతి కోరిన కమిషన్
గతంలో అనుమతించిన పోస్టులు 1,180, మిగులు పోస్టులు 150
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు. గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు.
వాటితోపాటు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడం, పోస్టులకు ఎంపికైనవారు చేరకపోవడం వంటి కారణాలతో 150 పోస్టులు మిగిలి ఉన్నాయని వివరించారు. వీటినీ భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలని కోరారు.