
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి మఫ్టీలో చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మినేని పోలీసులను నిలదీయడం గమనార్హం.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని కొమ్మినేని అడిగారు. దీంతో, పోలీసులు.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, కేసు ఏంటని కొమ్మినేని ప్రశ్నించగా.. వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అరెస్టు చేసి వాహనంలో తరలించారు. ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే చూపించి.. ఆయనను వాహనంలో తీసుకువెళ్లారు. అరెస్ట్ సమయంలో లోకల్ పోలీసులు లేకపోవడం విశేషం.
మరోవైపు, ఇంటి వద్ద అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఏపీ పోలీసుల్ని కొమ్మినేని శ్రీనివాసరావు పలు ప్రశ్నలు సంధించారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?. ముందస్తు నోటీసులు ఇచ్చారా? లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారా?.. అని అడిగారు. అందుకు ఏపీ పోలీసులు నోరు మెదపలేదు. కానీ అరెస్ట్ అనంతరం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు. కొమ్మినేనిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు తుళ్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం, కొమ్మినేనిని ఏపీకి తరలించారు.
ఒక సీనియర్ జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితా? కొమ్మినేని
ఏపీ పోలీసుల అక్రమ అరెస్ట్పై కొమ్మినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సీనియర్ సిటిజన్ని.. ఎలా అరెస్ట్ చేస్తారు? సీనియర్ జర్నలిస్ట్ ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటి?. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమో. ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించకుండా చేసే యత్నం’ జరుగుతోందని అన్నారు.

కొమ్మినేనిపై నమోదైన సెక్షన్లు
కొమ్మినేని శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 79,196(1) 353 (2),299,356(2),61(1),bns 67 ఐటీఏ 3(1), ఎస్సీఎస్టీ పీవోఏ యాక్ట్ నమోదైంది.
సంబంధం లేదని చెప్పినా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం
మరోవైపు, ఇటీవల అమరావతి మహిళల విషయమై జర్నలిస్ట్, విశ్లేషకులు కృష్ణం రాజు వ్యాఖ్యల్ని సాక్షి యాజమాన్యం ఇప్పటికే ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అమరావతి మహిళలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం గమనార్హం. ఇక, సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు సర్ధి చెప్పారు. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పదే పదే స్పష్టం చేసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిన్న, ఇవాళ తన లైవ్ షోలో కృష్ణంరాజు తరుఫున.. కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కొమ్మినేనిపై ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ ప్రయోగించింది.
జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించిన సాక్షి టీవీ
గత శుక్రవారం నాటి కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సాక్షి టీవీ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలను కూటమి నేతలు సాక్షి టీవీకి ఆపాందించడం సరికాదని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవాభిమానాలు చూపుతుందని.. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను.. సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్ధించదని సాక్షి టీవీ స్పష్టం చేసింది.

ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు: కృష్ణంరాజు
ఇదిలా ఉండగా, కృష్ణంరాజు కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైన కించపరిచి ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కృష్ణంరాజు అన్నారు.