కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపీ విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.
గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఆదేశాలు
కర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. స్వయంగా జైలుకు వెళ్లి దుర్గప్ప ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పింది. చికిత్స అవసరమైతే అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.


