రిజిస్ట్రేషన్ల అధికారంపై వ్యాజ్యం మూసివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు

AP Govt reported to High Court Authorization of registrations litigation - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాన్ని కల్పించడం సబ్‌ రిజిస్ట్రార్ల అధికారాన్ని అడ్డుకున్నట్టు కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో పాటు సబ్‌ రిజిస్ట్రార్లు కూడా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేయడానికి అర్హులేనని స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు ముందు ఓ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) మూసివేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎన్టీఆర్‌ జిల్లా కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామప్రసాద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top