సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాని పరిస్థితి ఏర్పడింది. జూన్ 12న పథకం అమలు జరగదని స్పష్టమైంది. రెండో ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేశారు.
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే స్కూల్ తెరిచేనాటికి ప్రతిఏటా తల్లికివందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి రూ.17వేలు ఎగనామం పెట్టింది.
రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఏడాది తల్లికి వందనంపై చంద్రబాబు సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు జమచేస్తారో ప్రకటించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఏడాది తల్లికి వందనంలో 20లక్షలమంది విద్యార్థులకు కోత విధించింది. రూ.260 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంతమందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎప్పుడిస్తారో బాబు సర్కార్ చెప్పలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు.


