సాక్షి,విజయవాడ: అమరావతిలో ఇప్పటికే భారీ వ్యయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు భవనాల హంగుల కోసం మరోసారి వందల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు సంబంధిత పనులకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
సూపర్ బ్లాక్ ఎఫ్లో ఉన్న హైకోర్ట్ భవనం వద్ద అదనపు వసతుల కోసం రూ.540 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్ స్టేషన్, బ్యూటిఫికేషన్ పనులు ఉన్నాయి.
అదే విధంగా, రాయపూడి ప్రాంతంలోని ఐఏఎస్ అధికారుల నివాస భవనాలకు కూడా హంగులు జోడించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్లలో హంగుల కోసం రూ.94 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పనుల్లో స్టోర్ రూమ్స్, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టెయిర్కేస్, బాల్కనీ విత్ కెనేపీ, పార్కింగ్ వసతులు వంటి అంశాలు ఉన్నాయి.ఇప్పటికే అమరావతిలో భవనాల నిర్మాణానికి భారీ నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటికి అదనంగా హంగుల కోసం మళ్లీ నిధులు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది.


