
పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది.
సాక్షి, అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం కార్మికులను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది.
గత నెల జనవరి 25న విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.
జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు.