ముంచేస్తున్నా.. నిర్లక్ష్యమే | Andhra pradesh: Paddy Stocks Soaked In Unseasonal Rains | Sakshi
Sakshi News home page

ముంచేస్తున్నా.. నిర్లక్ష్యమే

May 6 2025 4:42 AM | Updated on May 6 2025 4:42 AM

 Andhra pradesh: Paddy Stocks Soaked In Unseasonal Rains

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో నీటమునిగిన ధాన్యపు రాశులు

అన్నదాతలను నిండా ముంచిన కూటమి సర్కారు

వర్షాలుంటాయని ఐఎండీ ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం 

ముందుగానే ధాన్యం కొని ఉంటే ముప్పు తప్పేదంటున్న కర్షకులు 

పంట నీట మునిగి కన్నీరుమున్నీరవుతున్న రైతులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ధాన్యం కొనుగోలులో ముందుచూపు కొరవడిన ప్రభుత్వం అన్నదాత­లను నిండా ముంచేసింది. రెక్కల కష్టం వర్షంలో తడిసి ముద్ద­య్యిందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో మొ­దలైన వరి కోతలు మూడో వారంలో ఊపందుకు­న్నా­యి. అప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధా­న్యం కొనుగోలు కేంద్రాలు కాగితాలకే పరిమితమ­య్యా­యి. పంటకు కనీస మద్దతు ధర దక్కక రైతులు రోడ్డె­క్కారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి తూ­ర్పు­గోదావరి జిల్లాలోని పెరవలి, నిడదవోలు, జగ్గం­పేట, తాళ్లపూడి తదితర మండలాల్లో ఆందోళన­లకు దిగారు. 

ముందే హెచ్చరికలున్నా..
రబీ కోతలు ప్రారంభమైన తొలినాళ్లలో ధాన్యం కొను­గోలు చేయకపోవడంతో కనీస మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు శనివారం, ఆదివా­రం కురిసిన వర్షాలు రైతుల్ని ముంచేశాయి. వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతు­లకు తీవ్ర నష్టం కలిగింది. కుండపోత వర్షంతో రోడ్ల పక్కన, కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. కాకి­నాడ జిల్లాలో 3.4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

వారి లెక్కల ప్రకారమే ఇంకా 2.23 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలనేది లక్ష్యం కాగా, 2,63,076 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి, లక్ష్యాన్ని అధిగమించామంటూ కొనుగోళ్లను నిలిపి­వేశారు. కోనసీమ జిల్లాలో 5,86,616 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, 2 లక్షల మెట్రిక్‌ టన్నుల కొ­ను­గోలుకు ప్రభుత్వం అనుమతించింది.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లాలో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతు­న్నారు. ప్రభుత్వం ముందుగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే అకాల వర్షాల ముప్పు నుంచి బయటపడే వారమని రైతులు విలపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తడిసి ముద్దయిన ధాన్యాన్ని అధికారులే దగ్గరుండి కొనుగోలు చేయించారని, వరి కోతలు మొద­లవుతా­యనగానే అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రా­లను ముందుగానే ప్రారంభించిందని రైతులు గుర్తు చేసుకున్నారు.  

వర్షాలకు పంట దెబ్బతినడం సహజం: 
సాక్షి, అమరావతి: అధిక వర్షాలకు వరి పంట దెబ్బతిని, ధాన్యం తడిసిపోవడం సహజమేనని గృహ నిర్మాణ శా­ఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అకాల వర్షాల­కు కొన్ని జిల్లాల్లోనే పంట, ఆస్తి, ప్రాణ నష్టం వా­టిల్లిందన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  

అమ్ముకున్నా.. అమ్మకపోయినా నష్టమే
వర్షంలో తడిసి ముద్దయిన పంట కొనుగోలు మాట దేవుడెరుగు.. రెండు వారాలు ముందుగానే కోతలు పూర్తయి రైతులు తక్కువ ధరకు కమీషన్‌ ఏజెంట్లకు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సి వచ్చింది. 75 కేజీల బస్తా ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,750 ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా.. రైతుకు రూ.1,300–1,450కి మించి దక్కలేదు. ప్రతి బస్తాపై రైతులు రూ.400–500 నష్టపో­యా­రు. 

ధాన్యాన్ని త్వరగా ఒబ్బిడి చేసుకోవాలనే తలంపుతో యంత్రాలతో వరి కోత­లు పూర్తి చేశారు. కోత కోసిన వెంటనే ధాన్యాన్ని అమ్మేసుకోవడానికి మొగ్గు చూపారు. ఆ సమ­యంలో రైతు సేవా కేంద్రాల వద్ద రైతు నమోదు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయించుకోవడం, 17 శాతం తేమ ఉన్నా తీసుకోకపోవడం వంటి సవాలక్ష సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగ­మించలేక రైతులు రూ.400 నుంచి రూ.500 తక్కువైనా గత్యంతరం లేక కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement