AP: ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ | Andhra Pradesh Hospitals To Halt Aarogyasri Services From April 7 | Sakshi
Sakshi News home page

AP: ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Apr 3 2025 7:59 PM | Updated on Apr 3 2025 9:03 PM

Andhra Pradesh Hospitals To Halt Aarogyasri Services From April 7

సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు  ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూటమి సర్కార్‌ స్పందించడం లేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) ప్రతినిధులు ప్రకటించారు. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు.

‘‘అప్పుల భారం మోయలేక, బాధలు భరించలేక.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రతీ నెలా నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి రూ.330 కోట్ల రూపాయల సేవలు అందిస్తున్నాం. బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సగం కూడా రావడం లేదు. నెట్ వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు రూ. 3500 కోట్ల వరకూ పేరుకుపోయాయి. మందులు, పరికరాలు అప్పులిచ్చే కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి. బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రులు వైద్యులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేవు’ అని హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.

వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొందని మార్చి 7న నోటీసు పంపించాం. నోటీసు పంపించిన తర్వాత రూ.350 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మేం ఎప్పుడు డబ్బులు అడిగినా పాత బకాయిలు చెల్లించామనే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం చెల్లించే దానికంటే మేం ఎక్కువగానే సేవలు అందిస్తున్నాం. తొంభై శాతం ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 3300 ప్యాకేజీలకు సేవలు అందిస్తున్నాం. ప్రతీ నెలా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల మనుగడే కష్టంగా మారింది. మాకు ఉన్న బకాయిల్లో రూ.1500 కోట్లు అత్యవసరంగా చెల్లించాలి. అలా చెల్లించలేని పక్షంలో మా సర్వీసులను మొదలు పెట్టే పరిస్థితి లేదు. కొత్త ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కు వెళ్లేముందు ప్రభుత్వం మా బకాయిలన్నీ చెల్లించాలి’’ అని అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement