సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈశాన్య-తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడింది. కోస్తా అంతటా 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
కాగా, తెలంగాణలో కూడా ఈ నెలాఖరు దాకా నాన్స్టాప్ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో.. విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రుతుపవనాల ప్రభావంతో రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడే అవకాశముందని పేర్కొంటున్నారు.
ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్తో పాటు తూర్పు తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే.. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతోంది.


