గీత దాటితే చర్యలు తప్పవు | Ambati Rambabu Comments On Chandrababu And Nimmagadda | Sakshi
Sakshi News home page

గీత దాటితే చర్యలు తప్పవు

Feb 7 2021 5:05 AM | Updated on Feb 7 2021 5:05 AM

Ambati Rambabu Comments On Chandrababu And Nimmagadda - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా, గీతదాటి ఏకపక్షంగా వ్యవహరించే  వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి స్పష్టంగా చెప్పారని.. అందులో తప్పేమీ లేదన్నారు. పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ విధించిన ఆంక్షలు పూర్తిగా రాజ్యాంగ, చట్ట విరుద్ధమని.. దీనిని తాను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం మాటలు విని తప్పుడు చర్యలు తీసుకుంటే ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకుంటుందని.. వారిని బ్లాక్‌ లిస్టులో కూడా పెడతామని అంబటి హెచ్చరించారు. అదే సమయంలో చట్టప్రకారం పనిచేసే అధికారులనూ ఈ ప్రభుత్వమే రక్షిస్తుందని చెప్పారు. తప్పు చేయనంతకాలం ఉద్యోగులు భయపడాల్సిన అవసరంలేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదన్నారు.

రాజ్యాంగ హక్కును వ్యతిరేకిస్తారా?
మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు కదలడానికి, మీడియాతో మాట్లాడ్డానికి వీల్లేదని నిమ్మగడ్డ ఆంక్షలు విధించారని.. ఒక వ్యక్తిని ఈ విధంగా కట్టడి చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ఏ శక్తికీ లేదని అంబటి స్పష్టంచేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. మంత్రిపై ఆంక్షలు సభా హక్కులకు భంగం కల్గించడమేనన్నారు. చంద్రబాబుకు చిత్తూరులో పలుకుబడి లేకుండా చేస్తున్నందువల్లే ఇలా ఆంక్షలు విధించారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గమైన పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి రాంబాబు అన్నారు.

మేనిఫెస్టో విడుదలపై చర్యలేవి?
పంచాయతీ ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోందని కూడా ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాటి నుంచి తనకేదో అతీతమైన శక్తి వచ్చినట్లుగా, ఈ ప్రపంచంలో తానొక అద్భుతమైన శక్తిలా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కక్షతో టీడీపీ, వారి మిత్రపక్షాలకు లాభం చేయాలన్నట్లుగా నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారన్నారు. పార్టీ రహిత ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఏం చర్యలు తీసుకున్నారని.. అలాగే, ఈ–వాచ్‌ యాప్‌ను సెక్యూరిటీ సర్టిఫికేట్‌ లేకుండా ఎలా విడుదల చేశారని అంబటి ప్రశ్నించారు. మరోవైపు.. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాల నిలిపివేత రాజ్యాంగ వ్యతిరేకం కాదా.. వాటిపై ఏమైనా ఫిర్యాదులు అందాయా అని ఆయన నిలదీశారు. ఈ విషయంలో కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.  

ప్రజలకు రక్షణగా నిలిచేది వైఎస్సార్‌సీపీయే..
ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ అని.. ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా ఉండేది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని అంబటి స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం ఒక అడుగు ముందుకు వేయమనండి.. అప్పుడు చూద్దామని ఆయనన్నారు. ట్వీట్‌లు పెట్టే చంద్రబాబు కన్నా, రాష్ట్ర ప్రజలపట్ల వైఎస్సార్‌సీపీనే బాధ్యతగా ఉంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement