అమరావతి: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని నిబంధనలకు విరుద్ధంగా కుదిస్తూ కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు, అధికార టీడీపీ బినామీలకు తీరప్రాంతాన్ని ధారాదత్తం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. రేషనలైజేషన్ పేరుతో పోర్టుల పరిధిని నామమాత్రంగా తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేసింది.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సముద్ర తీర రక్షణ, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం పోర్ట్కు 64 కిలోమీటర్ల పరిధిని కేటాయించారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు సర్కార్ దానిని ఏకంగా 15 కిలోమీటర్లకు కుదించివేసింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 51 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రామాయపట్నం పోర్టు పరిధిని సైతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 15 కిలోమీటర్లకే పరిమితం చేస్తూ బరితెగించింది.
పోర్టుల పరిధిని ఈ స్థాయిలో తగ్గించడం వెనుక టీడీపీ బినామీల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోర్ట్ సమీపంలోని అత్యంత విలువైన తీర ప్రాంతంపై కన్నేసిన టీడీపీ బినామీలకు ఆ భూములను రాసిచ్చేందుకే పరిధిని భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసమే రేషనలైజేషన్ ముసుగులో ఈ భారీ స్కామ్కు పాల్పడ్డారని, దీనివల్ల పోర్టుల అభివృద్ధి దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం కానున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


