సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన మత్స్యకారులు అతి కష్టం మీద ఒకరిని కాపాడారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురానికి చెందిన నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34), మనవడు కలిసి గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో నూకరాజు, మీనా, సౌజన్య గల్లంతు కాగా.. నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


