అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు
తండ్రిని హతమార్చిన కుమారుడు
భార్యను హత్య చేసిన భర్త
వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో దారుణ ఘటనలు
బ్రహ్మంగారిమఠం/డుంబ్రిగుడ: మద్యానికి బానిసలై ఒకడు సోదరుడిని హతమార్చగా... మరొకడు కన్నతండ్రిని, ఇంకొకడు భార్యను హత్య చేశాడు. ఈ ఘటనలు వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో జరిగాయి. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ రోడ్డులో ఉంటున్న హైమావతికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటసుబ్బయ్య (45)కు వివాహమైంది. ఇతడికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు ఇతన్ని వదిలి వెళ్లిపోయారు. చిన్నకుమారుడు సురేష్ కూడా మద్యానికి అలవాటు పడడంతో భార్య, ఇద్దరు పిల్లలు విడిపోయారు.
అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు తల్లి దగ్గరే ఉంటున్నారు. శనివారం రాత్రి సురేష్ చికెన్ పకోడి తెచ్చుకున్నాడు. శనివారం చికెన్ తేవద్దని అమ్మ నాకు చెబుతూ ఉండేదని, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావని వెంకటసుబ్బయ్య మద్యం మత్తులో చికెన్పకోడీ, సురేష్ భార్య గురించి అవహేళనగా మాట్లాడాడు. అది మనసులో పెట్టుకున్న సురేష్ ఆదివారం వెంకటసుబ్బయ్య మద్యం తాగి, భోజనం చేసి మంచంపై నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై కొట్టాడు. తల్లితో వాడు చచ్చాడో లేదో చూడుపో అన్నాడు. బయట ఉన్న తల్లి హైమావతి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు సురే‹Ùను పోలీసులు అదుపులోకి తీసుకుని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కర్రతో భార్యను హతమార్చిన భర్త
మరో ఘటనలో అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ శెట్టిబంద గ్రామానికి చెందిన గెమ్మెలి కామయ్య మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య గెమ్మెలి కోమలి (40)తో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరి కోట్లాటకు దారి తీసింది. మత్తులో ఉన్న కామయ్య విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో భార్య మెడపై, శరీరంపై కర్రతో బలంగా మోది హత్య చేసి పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రిని చంపిన కొడుకు
బేతంచెర్ల: కొడుకు దాడి చేయడంతో తండ్రి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆకుల శివకుమార్(49) తరచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. శనివారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచి్చ, భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేస్తుండగా కుమారుడు శరత్ కుమార్ అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో క్షణికావేశానికి గురైన శరత్ కుమార్ తండ్రిపై కట్టెతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.


