బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం | 8 people die and 8 critically injured in explosion at fireworks manufacturing plant in Anakapalli | Sakshi
Sakshi News home page

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం

Apr 14 2025 5:05 AM | Updated on Apr 14 2025 5:05 AM

8 people die and 8 critically injured in explosion at fireworks manufacturing plant in Anakapalli

పేలుడు ధాటికి ధ్వంసమైన బాణసంచా తయారీ కేంద్రం

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం

అగ్ని కీలల్లో 8 మంది సజీవ దహనం

మరో 8 మందికి తీవ్ర గాయాలు

క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

విశాఖ, నర్సీపట్నం ఆస్పత్రులకు తరలింపు 

ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా 

రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటన 

ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

బాధితుల్ని సత్వరమే ఆదుకోవాలని డిమాండ్‌ 

జగన్‌ ఆదేశాలతో సహాయక చర్యల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు

పర్వతాలు పేలినట్టు.. భూమి కంపించినట్టు భారీ విస్ఫోటం.. అగ్నికీలలు ఎగసిపడ్డాయి.. 8 మంది కూలీలు సజీవ దహనం కాగా.. క్షతగాత్రులు దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. భోజనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అన్నం ముద్ద నోటికి చేరకుండానే ఎనిమిది మంది కూలీలు మరుభూమికి తర­లి­పోవడం అందరినీ కంటతడి పెట్టించింది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/అమరావతి: అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్నాహ్నం భారీ విస్ఫో­టం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో శరీరాలు ఛిద్రమై 8 మంది అక్కడికక్కడే మరణించారు.  మరో 8మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాలిన గాయాలతో బాధితులు హాహాకారాలు చేయగా.. ఒక వ్యక్తి తల లేకుండా కేవలం మొండెంతో దర్శనమిచ్చి భీతిగొల్పే హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

కైలా­సపట్నం సమీపంలోని విజయలక్ష్మి ఫైర్‌ వర్క్స్‌లో సంభవించిన ఈ ఘోర ప్రమాదం అగ్నిమాపక సిబ్బంది 4 గంటల­కుపైగా శ్రమిస్తే తప్ప మంటలు అదుపులోకి రాలేదు. క్షతగా­త్రుల్లో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించగా.. మరో ఇద్దరికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హోం మంత్రి వి.అనిత ప్రకటించారు. ప్రమాదంలో కైలాసపట్నం గ్రామానికి చెందిన వారితోపాటు అనకాపల్లి జిల్లా రాజు­పేట, చౌడువాడ, విశాఖపట్నం, తూర్పు గోదా­వరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాంతాలకు చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో విజయ­లక్ష్మి ఫైర్‌ వర్క్స్‌ యజమాని తాతబ్బాయి కూడా ఉన్నారు.

ప్రమాదం జరిగిందిలా!
భోజన విరామం తీసుకుందామనుకునే సయమంలో మనోహర్‌ అనే వ్యక్తి బాణసంచాకు ఉపయోగించే ముడి సరుకును వేగంగా దంచడం మొదలు­పెట్టాడు. ఎక్కువ బలం ఉపయోగించి దంచడం వల్ల అధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యి మంటలు చెలరేగినట్టు.. ఆ రేణు­వులు వారం రోజులపాటు తయారుచేసిన మందుగుండు సామగ్రిపై పడటంతో భారీ ప్రమాదం వాటిల్లినట్టు తెలుస్తోంది. భారీ పేలుడు సంభవించడంతో భూమి అదిరింది. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయా­యని కైలాసపట్నం గ్రామ ప్రజలు మొదట్లో భావించారు. అగ్ని­కీలలు ఎగసిపడటంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి తరలివచ్చారు.

సాధారణంగా ఈ కేంద్రంలో నిత్యం 20 నుంచి 30 మంది వరకూ పనిచేస్తుంటారు. ఆదివారం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో కేవలం 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు. లేదంటే బాధితుల సంఖ్య మరింత పెరిగేదని గ్రామస్తులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రమాదం జరగ్గా.. ఒంటిగంట సమయంలో వరహాలు అనే వ్యక్తి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. నర్సీపట్నం, నక్క­పల్లి, యలమంచిలి ఫైర్‌స్టేషన్ల నుంచి ఫైర్‌ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని నిలువరించేందుకు 4 గంటలకుపైగా సమయం పట్టింది.

మందుగుండు సామగ్రి దంచుతున్న మనోహర్‌ అనే వ్యక్తి తల, కుడి చేయి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. భారీ పేలుడుకు తల, కుడి చేయి ఎగిరిపో­యినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురి శరీరాలు ముక్కలై పూర్తిగా కాలిపోయాయి. గతంలో ఇక్కడి బాణసంచా తయారీ కేంద్రం పాయక­రావుపేట నియోజక­వర్గం ఎస్‌.రాయవరంలోని గోకులపాడులో ఉండేది. అక్కడ 2015 మార్చి 29న పేలుడు సంభవించడంతో ఆ ప్రమాదంలోనూ 8 మంది మరణించారు. అనంతరం దీనిని మూసివేశారు. 

సీఎం చంద్రబాబు ఆరా
బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. కాగా.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌.. హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అధికార యంత్రాంగం సత్వరమే స్పందించిందని, క్షతగా­త్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం సంభవించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించడం, మరో 8మంది తీవ్రంగా గాయపడటం విచారకరమన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నాయకు­లను ఆదేశించడంతో వారు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. క్షతగాత్రు­లకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలి
బాణసంచా పేలుడులో మృతి చెందిన కూలీల కుటుంబాలకు తక్షణమే రూ.కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డిమాండ్‌ చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కాగా.. మృతి చెందిన 8 మంది కార్మికుల కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి భద్రతా లోపాలు లేకుండా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement