అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్–1938 జిల్లా అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షుడు జి.రవీంద్ర అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పి.జగదీష్ (బ్రహ్మసముద్రం), అకడమిక్ కమిటీ కన్వీనర్గా ఎస్.గురుమూర్తి (కంబదూరు), సభ్యులుగా డి.బాబా ఫకృద్దిన్ (గుంతకల్లు), డి.పాండురంగ వరప్రసాద్ (ఉరవకొండ), ఎన్నికల కమిటీ కన్వీనర్గా జి.రవికుమార్ (కుందుర్పి), సభ్యులుగా సి.మనోహర్ (కణేకల్లు), క్రమశిక్షణ కమిటీ కన్వీనర్గా తిరుపాల్ నాయక్ (అనంతపురం అర్బన్), మహిళా కమిటీ కన్వీనర్గా బండి సరిత (బెళుగుప్ప), సభ్యులుగా డి.శ్రీదేవి (కళ్యాణదుర్గం), కె.నాగజ్యోతి (నార్పల) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జి.రవీంద్ర, ప్రధాన కార్యదర్శి బి.హనుమప్ప మాట్లాడుతూ సంఘ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును విస్తరించాలని కోరారు. భవన నిధి సేకరణకు ప్రాధాన్యమివ్వాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలతోపాటు పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వం ద్వారా పోరాడతామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.అశోక్ నాయక్, ఐఫియా శాశ్వత సభ్యుడు సత్యప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు సాకే భాస్కర్, అదనపు కార్యదర్శి పోతులయ్య, సీనియర్ నాయకులు బుటారి వెంకటేశులు, బి.సి.తిన్నప్ప, చెన్నకేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు వజీర్ భాష, నాగరాజు, జిల్లా కార్యదర్శి హనుమంతు పాల్గొన్నారు.
మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోండి
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రభుత్వం 2026–27కు సంబంధించి మద్యం షాపుల రెన్యూవల్ కోసం గెజిట్ విడుదల చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎస్కేడీ ప్రసాద్ తెలిపారు. శనివారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామ్మోహన్రెడ్డితో కలిసి నగరంలోని మద్యం షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 138 మద్యం షాపులకు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతమున్న లైసెన్స్ ఫీజుపై 38 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉందన్నారు. రెన్యూవల్ చేసుకోని మద్యం దుకాణాలకు మరలా లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ జయనాథ్రెడ్డి పాల్గొన్నారు.
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని దాడి.. వ్యక్తిపై కేసు
తాడిపత్రి రూరల్: ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కోపంతో దాడికి దిగిన వ్యక్తిపై కేసు నమోదైంది. అప్గ్రెడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని సజ్జలదిన్నె వద్దగల ఆదివిష్ణు గ్రానైట్ ఫ్యాక్టరీలో స్థానిక రాగితోటపాలెంకు చెందిన రమేష్, చాకలి రమేష్లు పని చేసేవారు. తరుచుగా రమేష్కు చాకలి రమేష్ ఫోన్ చేసి పనులకు పురమాయిస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన రమేష్ ఫోన్ లిఫ్టు చేసేవాడు కాదు. దీంతో ఆగ్రహించిన చాకలి రమేష్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేష్ వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కులం పేరుతో దూషించి రాయితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమైన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.


