అనంతపురం సెంట్రల్: తొమ్మిది నెలలుగా తీసుకున్న శిక్షణ ప్రతిబింబించేలా పరేడ్ ఉండాలని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. జిల్లా శిక్షణ కేంద్రంలో 101 మంది సివిల్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ నెల 7న జరగనున్న నేపథ్యంలో శుక్రవారం పోలీసు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ఎస్పీ పర్యటించారు. కార్యక్రమం విజయవంతమయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగభూషణం, డీటీసీ డీఎస్పీ విజయకుమార్, ఏఆర్డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
160 క్వింటాళ్ల
రేషన్ బియ్యం స్వాధీనం
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ‘నల్ల బజారుకు పేదల బియ్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం డి.హీరేహాళ్ మండలం లింగమనహళ్లి వద్ద ఆంధ్ర–కర్ణాటక హైవేపై విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఐషర్ వాహనంలో 160 క్వింటాళ్ల (320 బస్తాలు) రేషన్ బియ్యం అక్రమంగా తరలుతుండటాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ నరేంద్రభూపతి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజశేఖర్ తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
12వ పీఆర్సీ కమిటీ వేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించి 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని నియమించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా ఇంతవరకు కమిటీని నియమించకపోవడం సరికాదన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం (డీఏ)ను వెంటనే ప్రకటించి, ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. నాయకులు వి. రాజశేఖర్, రవికుమార్, నాగభూషణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


