● బోల్తాపడిన పలువురు అమాయకులు
● తేరుకునేలోపు ఉడాయించిన వ్యాపారులు
ఉరవకొండ: అత్యంత నాణ్యమైన సోనా మసూరి బియ్యం అతి తక్కువ ధరకే అంటే అమాయకులు నమ్మి కొన్నారు. ప్యాకెట్లు ఇంటికి తీసుకెళ్లి గుమ్మరిస్తే స్టోర్ బియ్యం కనిపించడంతో మోసపోయామని లబోదిబోమన్నారు. బుధవారం నలుగురు వ్యక్తులు ఆటోలో బియ్యం బస్తాలు వేసుకుని కోటవీధి, రంగా వీధి తదితర ప్రాంతాల్లో కలియదిరిగారు. 50 కిలోల ప్యాకెట్ రూ.2,600 మాత్రమేనని అనడంతో పలువురు ఆసక్తి చూపారు. పైభాగంలో బియ్యం నాణ్యత బాగుండటంతో ఒకొక్కరు నాలుగు బ్యాగులు (2 క్వింటాళ్లు) చొప్పున కొనుగోలు చేశారు. తర్వాత ఒకరిద్దరు ప్యాకెట్లను ఇంట్లో గుమ్మరించి పరిశీలిస్తే అసలు బండారం బయటపడింది. వ్యాపారులు పైన నాణ్యమైనవి ఉంచి.. లోన స్టోర్ బియ్యం (దొడ్డుబియ్యం) ఉంచారని గుర్తించారు. అలా ఒకరి తర్వాత ఒకరు పరిశీలించగా.. అందరూ వ్యాపారుల మాటలు నమ్మి బొక్కబోర్ల పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యాపారుల కోసం వెతకగా.. అప్పటికే వారు ఆటోలో తుర్రుమన్నారు. దాదాపు రూ.80 వేల వరకు బియ్యం వ్యాపారం జరిగినట్లు తెలిసింది.


