రాప్తాడు రూరల్: ఆకతాయిల కామెంట్.. దాడులతో ఉద్రిక్తతకు దారి తీసింది. దూషణలు.. దాడులతో అసలు ఏం జరుగుతోందో స్థానికులకు అర్థం కాని పరిస్థితి. అనంతపురం శివారులోని ఐజీ నగర్లో నివాసముంటున్న శరత్రెడ్డి తనకు కాబోయే భార్యతో కలిసి మంగళవారం ద్విచక్రవాహనపై వస్తుండగా కళ్యాణదుర్గం రోడ్డులో ముగ్గురు వ్యక్తులు కామెంట్ చేశారు. దీంతో శరత్రెడ్డి సదరు వ్యక్తులతో గొడవపడి పరస్పరం దాడులు చేసుకున్నారు. కామెంట్ చేసిన వారిలో మల్లికార్జున అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీనిపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరుసటి రోజు తండ్రిపై దాడి
బుధవారం కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం వద్ద శరత్రెడ్డి తండ్రి అమర్నాథ్రెడ్డి మరికొందరితో కలిసి టీ తాగుతున్నాడు. అంతకుముందు రోజు ఘర్షణలో గాయపడిన మల్లికార్జునకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి.. అమర్నాథ్రెడ్డిపై దాడి చేశారు. అక్కడున్న వారు శరత్రెడ్డికి అండగా నిలుస్తూ ప్రతిదాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడుల్లో పాల్గొన్న వారి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు.


