అనంతపురం: కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో నిరుపేద, మధ్య తరగతి, ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ కల్పతరువుగా వెలుగొందుతున్న జేఎన్టీయూ అనంతపురం 18వ ఆవిర్భావ దినోత్సవం గురువారం జరగనుంది. ఉదయం 10 గంటలకు వర్సిటీ ప్రధాన ఆడిటోరియంలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు పాల్గొంటారు. విశిష్ట అతిథులుగా మాజీ వీసీలు ప్రొఫెసర్ కే.లాల్కిశోర్, ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస్కుమార్, ప్రొఫెసర్ జి. రంగ జనార్ధన్, ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాస రావు పాల్గొననున్నారు.
వైఎస్సార్ చలువతోనే..
దశాబ్దాలుగా ఎంతో మంది ఇంజినీర్లను, శాస్త్రవేత్తలను జాతికి జేఎన్టీయూ (ఏ) అందించింది. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ప్రారంభమైన ఈ కళాశాల 2008లో జేఎన్టీయూ అనంతపురం వర్సిటీగా రూపాంతరం చెందింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్చారు. అప్పట్లో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఉన్న రాయలసీమలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలను వర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఈ ప్రాంత అభ్యున్నతికి, ఔన్నత్యానికి కృషి చేశారు. ‘సీమ’ విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేసి సిరులు పంచారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు జేఎన్టీయూ (ఏ) పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, ఓటీపీఆర్ఐ, కలికిరి, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలతో పాటు శ్రీ కాళహస్తీశ్వర ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వర్సిటీ పరిధిలో మొత్తం నాలుగు కానిస్టిట్యూట్ కళాశాలలు ఉండగా, తాజాగా వీటి సంఖ్య ఐదుకు పెరిగింది. వర్సిటీ పరిధిలోని 98 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో లక్ష మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
దివంగత సీఎం వైఎస్సార్ చలువతో ఏర్పడిన జేఎన్టీయూ(ఏ)
నేడు 18వ ఆవిర్భావ దినోత్సవం
విశిష్ట అతిథులుగా
హాజరుకానున్న మాజీ వీసీలు


