హిందూపురం టౌన్: ‘చరిత్ర మన ముందుతరాల జీవన విధానాన్ని, నాటి సమాజపు స్థితిగతులను తెలపడమే కాకుండా భవిష్యత్ తరాలకు దిక్సూచిలా తోడ్పడుతుంది. ప్రజల్లో చరిత్రపట్ల, చారిత్రక ఆధారాలపట్ల అవగాహన లేకపోవడం వల్ల చారిత్రక శాసనాలు, నిర్మాణాలు నిరాదరణకు గురవుతున్నాయి’ అని చరిత్ర అధ్యయనకారుడు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దగిరి శ్రీనివాస్ బుధవారం పేర్కొన్నారు. లేపాక్షి మండలం మానెంపల్లి గ్రామంలో చెరువు లోతట్టు గల శివాలయంలోని 11 వందల సంవత్సరాల చరిత్ర గల శిలాశాసనం అవమానకర స్థితిలో చెరువులో పారవేయడం అన్యాయమన్నారు. ప్రదేశాన్ని సందర్శించి శాసనాన్ని పరిరక్షించమని గ్రామస్థులకు విన్నవించినప్పటికీ ఫలితం లేదన్నారు. మానెంపల్లి చెరువుకట్టపై గల ఈశ్వర దేవాలయం వద్ద స్థాపించిన ఈ శిలా శాసనం 1912లో పురావస్తు శాఖలో నమోదు చేశారన్నారు. ఈ శాసనం నోళంబ పల్లవరాజు అయ్యపదేవుని పాలనను తెలియజేస్తుందన్నారు.
10 టన్నుల పశు మాంసం స్వాధీనం
హిందూపురం టౌన్: హిందూపురం నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు అక్రమంగా రెండు టాటా ఏస్ వాహనాల్లో తరలిస్తున్న పశుమాంసాన్ని బుధవారం దేవనహళ్లి వద్ద కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హిందూపురం నుంచి పశు మాంసాన్ని తరచూ బెంగళూరుకు అక్రమంగా తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హిందూపురం నుంచి రెండు టాటా ఏస్ వాహనాల్లో దాదాపు 10 టన్నుల పశు మాంసం తరలిస్తుండగా, కర్ణాటక పోలీసులు దేవనహళ్లి సమీపంలో వాహనాలను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. హిందూపురం నుంచి పెద్ద ఎత్తున పశుమాంసం కర్ణాటకకు పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నా ఇక్కడి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.


