23న భారత పరిశ్రమల సమాఖ్య సదస్సు
అనంతపురం టౌన్: ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 23న జేఎన్టీయూ ఆడిటోరియంలో భారత పరిశ్రమల సమాఖ్య రీజియన్ కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం జేఎన్టీయూలోని ఆడిటోరియాన్ని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. 2026 రీజియన్ కాన్ఫరెన్సు ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు అనుగుణంగా అవకాశాలను ప్రదర్శించడం, పారిశ్రామిక ఒప్పందాలు, పెట్టుబడులపై అవగాహన కల్పించడంతోపాటు ఎంఎస్ఎంఈలు, జాతీయ స్థాయిలో అనుసంధానించడం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసయాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపాల్ దిలీప్, రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ హఫీజ్బాషా పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు అరెస్ట్
యల్లనూరు: మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిని బుధవారం అరెస్ట్ చేశారు. విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తనతో పాటు అసభ్యపదజాలంతో మాట్లాడారన్న ఆరోపణలపై ఉపాధ్యాయుడిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్కు పంపించామని చెప్పారు.


