వేధింపులు, అరాచకాలు తాళలేక వరుసగా బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా టీడీపీ నేతలు ఏ మాత్రమూ తగ్గడం లేదు. ‘మాకు పై నుంచి ప్రెజర్ ఉంద’ని చెబుతూ పోలీసులు పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు చెబితే చాలు ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరులోని జగనన్న లేఔట్లో మోటార్లను దొంగతనం చేశాడన్న తప్పుడు ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ నాయకుడు అంకే నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను తప్పు చేయకపోయినా స్థానిక టీడీపీ నేత సూర్యనారాయణ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో చెబుతూ నరేంద్ర క్రిమి సంహారక ద్రావణాన్ని తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితుణ్ని బెంగళూరుకు తరలించారు. ఇలా టీడీపీ నేతలు వరుస వేధింపులకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. బాధితులపైనే కేసులు పెడుతూ ‘పచ్చ’ నాయకులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన విమర్శలకు కౌంటర్గా తాను సమాధానమిస్తే మూడు రోజుల పాటు పోలీసులు చిత్రహింసలకు పాల్పడ్డారని పటాస్ శ్రీకాంత్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


