● మాజీ మంత్రి శైలజనాథ్ ధ్వజం
అనంతపురం: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కు శనివారం మాజీ మంత్రి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, ప్రశ్నపత్రాల లీకేజీల, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక సార్లు ప్రశ్నపత్రాలు లీకేజీ కావడాన్ని ప్రజలు గమనించాలన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘చేతన’తో ట్రాన్స్జెండర్ల సాధికారత
అనంతపురం సెంట్రల్: సమాజంలో వివక్షతకు గురవుతున్న ట్రాన్స్జెండర్లలో మార్పు తెచ్చేందుకు ఎస్పీ జగదీష్ ‘చేతన’కు శ్రీకారం చుట్టారు. ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లు, అసభ్య ప్రవర్తనకు స్వస్తి పలికి ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన వైపు నడిపించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో జిల్లాలోని ట్రాన్స్జెండర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సత్వర సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ కోర్సులు, టైలరింగ్, హస్తకళలు, ఇతర రంగాల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.


