రామగిరి: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ప్రసిద్ధిగాంచిన నసనకోట ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,030 నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మహమ్మద్ అలీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.ముత్యాలమ్మ ఆలయ సమీపంలో కొన్ని నెలలుగా భారీస్థాయిలో పేకాట జరుగుతోంది. ఈ ఆలయం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ అత్యంత ప్రసిద్ధి గాంచడంతో ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇదే అదనుగా అక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు రావడంతో ఆదివారం దాడి చేశారు. జూదరులను అరెస్టు చేసి.. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


