అనంతపురం అర్బన్: మెగా పేరెంట్– టీచర్ మీట్ (పీటీఎం) ఈనెల 24న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. 1,724 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. పీటీఎంకు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగా ఈ సారి కూడా పీటీఎం పండుగ వాతావరణంలో జరుపుతామన్నారు. 10,499 మంది ఉపాధ్యాయులు, 1,67,434 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు 1,28,644 మంది పాల్గొంటారన్నారు. మీట్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ముఖాముఖి మాట్లాడి పిల్లలు ఏవిధంగా చదువుతున్నారు. తదితర వివరాలపై చర్చిస్తారన్నారు. ఈ ఏడాది మరో రెండు కార్యక్రమాలు అదనంగా చేపట్టనున్నామన్నారు. పాఠశాలకు ఏ సదుపాయాలు అవసరం అనే వివరాలతో దాతల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో వేదిక ఏర్పాటు చేశామన్నారు. దాతలు ఈ వేదిక ద్వారా వాటిని సమకూర్చవచ్చన్నారు. వారి సహకారంతో పాఠశాలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చుతామన్నారు. ఇక లీప్ యాప్ కూడా అమలు చేయనున్నామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన విద్యావిషయాలు, హాజరు, మార్కులు, పిల్లలతో తల్లిదండ్రులు ఏవిధంగా మాట్లాడాలి వంటి వివరాలను తెలియజేస్తామన్నారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
కళ్యాణదుర్గం రూరల్: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల, కమ్మనచెట్ల కాలనీ మహిళలు శుక్రవారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సమస్య పరిష్కరించేవరకూ కదిలేది లేదన్నారు. స్థానిక అధికార పార్టీ నేతలకు తెలిపిన ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మున్సిపల్ అఽధికారులు, పోలీసులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 5 బెల్టు షాపులు నిర్వహించి మద్యం సరఫరా చేయిస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు తాగునీటి సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.


