అనంతపురం ఎడ్యుకేషన్: నీట్–2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 690 మార్కులతో అఖిల భారత స్థాయిలో 36వ ర్యాంకు సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచింది. ఆమె తండ్రి డాక్టర్ ఎన్. ప్రవీణ్ దీన్ కుమార్ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో శిశురోగ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా, తల్లి డాక్టర్ బి. ప్రవీణ కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల (కేఎంసీ)లో మైక్రోబయాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రేరణ విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గాయత్రి వేదవ్యాస్ శాఖలో విద్యాభ్యాసం చేసి ఈ ఘనత సాధించింది.
తొలి ప్రయత్నంలోనే జషన్ దీప్ విజయం
అనంతపురం నగరానికి చెందిన సంగటి జషన్ దీప్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే నీట్లో 618 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో 5,496వ ర్యాంకు, తన కేటగిరీలో 2,483వ ర్యాంకు సాధించాడు.ఆయన తండ్రి సంగటి నిరంజన్ రెడ్డి బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు జెడ్పీహెచ్ఎస్లో ఫిజికల్ డైరెక్టర్గా, తల్లి చర్లపల్లి రమాదేవి ఉరవకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
బెళుగుప్ప: మండల కేంద్రంలోని బెళుగుప్ప తండా వాసి, కేజీబీవీలో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగిని కవిత , చిన్న కుళ్లాయి దంపతుల కుమారుడు గణేష్నాయక్ నీట్లో సత్తాచాటాడు. 515 మార్కులతో ఎస్టీ కేటగిరిలో 616వ ర్యాంక్ సాధించాడు. ఆల్ ఇండియా స్థాయిలో 71,038వ ర్యాంక్తో నిలిచాడు.
నామాల ప్రేరణ, జషన్ దీప్ రెడ్డి, గణేష్ నాయక్


