అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన కురుబ వన్నూరప్పను, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా అదే నియోజకవర్గానికి చెందిన ఎస్.నబీసాబ్ను నియమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాల సమన్వయం, ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మహిళా సాధికారతే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘మహిళా సాధికారతే లక్ష్యంగా సత్యసాయి పలు కార్యక్రమాలు చేపట్టారని అందులో భాగంగానే మహిళా విద్యను ప్రోత్సహిస్తూ అనంతపురంలో ప్రత్యేకంగా సత్యసాయి మహిళా క్యాంపస్ను ప్రారంభించారు. ఆయన మార్గంలోనే నేడు ట్రస్ట్ సైతం చక్కటి వసతులతో నూతన వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది’ అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. గురువారం రత్నాకర్ రాజు నిర్మాణ పనులను ప్రారంభించారు. 1500 మంది విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలతో వసతి కల్పించేందుకు ఈ వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు. క్యాంపస్లో ఏర్పాటు చేసిన సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రారంభోత్సవం చేశారు.


