● కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ చైర్పర్సన్గా శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకారశాఖకు అనుబంధంగా స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న అనంతపురం కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ చైర్పర్సన్గా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు కుమార్తెను ఇచ్చిన మామ బి.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు సీనియర్ ఇన్స్పెక్టర్ దౌలా పర్సన్ ఇన్చార్జిగా కొనసాగుతుండగా... ఈనెల 10న రాష్ట్ర ప్రభుత్వం నాన్ అఫీషియల్ కింద ముగ్గురు సభ్యులతో కూడిన త్రీమెన్ కమిటీని నియమించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి మామ, కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన బి.శ్రీనివాసులును చైర్పర్సన్గా, అదే గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మీనారాయణ, జెర్రిపోతుల ముత్యాలన్నను కమిటీ సభ్యులుగా నియమించారు. దీంతో గురువారం స్థానిక సెంట్రల్ స్టోర్స్ కార్యాలయంలో చైర్పర్సన్, ఇద్దరు సభ్యులు ప్రమాణాస్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకులు చాలా మంది పదవుల కోసం ఎదురుచూస్తుండగా ఇలాంటి చిన్నపాటి పదవులను కూడా ఎమ్మెల్యే తన మామకు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమానికి అర్బన్ టీడీపీ నాయకులు పెద్దగా హాజరు కాకపోవడం విశేషం.


