పాడేరు రూరల్: ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న మోటర్, ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అమర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాడేరు జిల్లా కేంద్రంలో మోటర్ యూనియన్ నాయకులతో కలిసి మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోటర్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆటో, మోటర్ ట్రాన్స్పోర్టు కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. ’వాహన మిత్ర’ సాయం ఇస్తామని చెప్పి నేటికీ రెండో విడత ఇవ్వలేదని, భారీగా జరిమానాలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్, జీఎస్టీ పన్నులు రద్దు చేయాలని, డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి పెన్షన్ సౌకర్యంతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ’సీ్త్ర శక్తి’ (ఉచిత ప్రయాణ) పథకం వల్ల ఆటో, ఇతర రవాణా వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డ్రైవర్లకు సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 10 లక్షల బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మోటర్ యూనియన్ నాయకులు కొండబాబు, వెంకటరమణ, సన్యాసీరావు, సింహచలం, రామారావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


