● ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి
చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గిరిజన సబ్ ప్లాన్ నిధులతో విత్తనోత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ (ఏడీఆర్) డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాగి, సామ, కొర్రలు వంటి పంటలపై ప్రత్యేక పరిశోధనలు జరిపి, దిగుబడిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రొసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని తెలిపారు. చింతపల్లి–1 వరి రకం తరహాలోనే, స్థానిక రాజ్మా పంటకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తామని వెల్లడించారు. దీనిని ఢిల్లీలోని పీపీవీఎఫ్ఆర్/ఎన్బీపీజీఆర్ సంస్థల్లో రిజిస్ట్రేషన్ చేయించి, మేలైన విత్తనాలను రైతులకు అందిస్తామని పేర్కొన్నారు. పరిశోధనా కేంద్రంలో గతంలో నిలిచిపోయిన పూల సాగును తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. బంతి, గ్లాడియోలస్ వంటి పూల రకాలపై పరిశోధనలు చేసి, తక్కువ సమయంలో రైతులు అధిక లాభాలు పొందేలా చర్యలు చేపడతామని ఆమె వెల్లడించారు. కేంద్రంలో 200లకు పైగా ఉన్న ఔషధ మొక్కల పెంపకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. వీటితో పాటు తేనెటీగల పెంపకంపై కూడా పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ శాస్త్రవేత్తలు సందీప్ నాయక్, బాలహుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు.


