పారదర్శకతపై ప్రభుత్వం ఫోకస్
పాఠశాల నోటీస్బోర్డుతో పాటు వెబ్సైట్లో వివరాలు తప్పనిసరి
జీవో జారీ చేసిన సర్కారు
జిల్లాలో అమలుపై సందేహాలు
ఆదిలాబాద్టౌన్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి పారదర్శకత తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది. విద్యార్థుల నుంచి ఏయే రకాల ఫీజులు వ సూలు చేస్తున్నారో పూర్తి వివరాలను ఆయా విద్యాసంస్థల నోటీస్బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు వెబ్సైట్లోనూ పొందుపరచాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రైవేట్లో పిల్ల లను చదివించే తల్లి దండ్రుల్లో హర్షం వ్యక్తమవుతుంది. అయితే జిల్లాలో ఈ నిబంధన ఎంతవరకు అమలవుతుందనేది వేచి చూడాల్సిందే.
ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు..
ఏటా విద్యా సంవత్స రం ప్రారంభం కాగానే ప్రైవేట్ పాఠశాలల యా జమాన్యాలు అధిక ఫీజు లు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నా యి. అడ్మిషన్, స్కూల్, పరీక్ష ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, రవాణా వంటి వాటి పేరిట ఇష్టానుసారం బాదేస్తున్నారు. అయితే ఏ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారు.. ఎంత వసూలు చేస్తున్నారు.. విద్యా సంవత్సరానికి మొత్తం ఎంత ఖర్చవుతుంది అనే విషయాల్లో స్పష్ట త లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈపరిస్థితుల్లో ఫీజుల వివరాలు ముందుగానే బహిరంగంగా వెల్లడించడం వల్ల తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితికనుగుణంగా పాఠశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
వెల్లడించాల్సిందే..
ప్రభుత్వ తాజా ఆదేశాలతో విద్యాసంస్థలు ఫీజుల విషయంలో స్పష్టమైన సమాచారాన్ని తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. నోటీస్బోర్డుపై ప్ర దర్శించడంతో పాటు ఆయా పా ఠశాలల వెబ్సైట్లులలోనూ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమలే కీలకం..
ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు ఎలా జరుగుతుందనేదే కీలకంగా మారింది. జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రకటించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఆదేశాల లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలోని ప్రైవేట్
పాఠశాలల వివరాలు
ఎయిడెడ్ 02
ఆన్ ఎయిడెడ్ 184
సీబీఎస్ఈ సిలబస్తో కూడినవి 02
ఇంకా ఆదేశాలు అందలేదు
ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించి యాజమాన్యాలు వసూలు చేసే ఫీజుల వివరాలను తప్పనిసరిగా నోటీసుబోర్డులో ఉంచడంతో పాటు వెబ్సైట్లోనూ పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లగా తెలిసింది. అయితే మాకు ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఉత్తర్వులు అందిన వెంటనే అన్ని పాఠశాలలను తనిఖీ చేసి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– మాధవి, జిల్లా విద్యాశాఖ అధికారి
కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో వివిధ పేర్లతో అదనపు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులు అడపదడపా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పాఠశాలలో వసూలు చేస్తున్న మొత్తం ఫీజు ఎంత? అందులో ఏయే అంశాలకు ఎంత మొత్తం కేటాయించారు? అనే వివరాలు స్పష్టంగాా ఉంటే తల్లిదండ్రులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దీంతో అనవసరమైన లేదా అనుమతిలేని వసూళ్లకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అదనపు వసూళ్లకు
అడ్డుకట్ట పడేనా..?


