ఆదిలాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఎంపీ గోడం నగేశ్తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కోరారు. ఈమేరకు కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం ఢిల్లీలో కలిసి విన్నవించారు. రాష్ట్రంలో మెరుగైన రహదారి అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రవాణా, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి తెలంగాణ మున్సిపాలిటీలకు సంబంధించిన అర్బన్ చాలెంజ్ ఫండ్ అంశంపై చర్చించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎం.రఘునందన్ రావు, పాల్గొన్నారు.


