ఇంద్రవెల్లి: 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తతతో ఇద్దరు గర్భిణులకు క్షేమంగా పురుడు పోసిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. 108 సిబ్బంది, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన కుమ్ర సత్యశ్రీ అనే గర్భిణీకి బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు రిమ్స్కు రెఫర్ చేశారు. 108లో తరలిస్తుండగా గర్భిణీకి నొప్పులు ఎక్కువ కావడంతో మావల సమీపంలో ఈఎంటీ సిద్ధేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది పురుడు పోశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. హైరిస్క్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తుండగా 108 సిబ్బంది మాత్రం క్షేమంగా వైద్యం అందించడం గమనార్హం. అలాగే సిరికొండ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రేవతికి పురిటి నొప్పులు రాగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలిస్తుండగా, దస్నాపూర్ సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ప్రవీణ్ వైద్యం అందించగా మగశిశువుకు జన్మనిచ్చింది. కార్యక్రమంలో అంబులెన్స్ పైలెట్లు షేక్ సాహిద్, రాజ్కుమార్ ఉన్నారు.


