నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో గల కడెం నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి అధికారిక సీక్వెల్గా రూపుదిద్దుకుంటున్న ‘నగరానికి ఏమైంది’ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ ధాస్యం దర్శకత్వం వహిస్తుండగా, ప్రధాన పాత్రల్లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మగాంటి, అనీషా ఆంబ్రోస్ నటిస్తున్నారు. ప్రకృతి అందాలు, పచ్చదనంతో కూడిన దృశ్యాల నడుమ కీలక సన్నివేశాలను చిత్రీ కరించారు. విషయం తెలుసుకున్న నేరడిగొండ పరి సర గ్రామాల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో కడెం నది తీరానికి తరలివచ్చారు. తమ అభిమాన నటీనటులు విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం తదితరులను నేరుగా చూడటానికి ఆసక్తి కనబర్చారు.


