తాండూర్: మండల కేంద్రంలోని ఓ స్వీట్హౌజ్లో కొనుగోలు చేసిన ఐస్క్రీమ్లో ఈగ రావడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే...కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటికి చెందిన తిరుపతి మంగళవారం తన కుమారుడికి మండల కేంద్రంలోని బాలాజీ దేవ్నారాయణ స్వీట్హౌజ్లో శివశక్తి కంపెనీకి చెందిన చాకోబార్ ఐస్క్రీమ్ కొనిచ్చాడు. దానిని ఆ బాలుడు తింటుండగా అందులో చనిపోయిన ఈగ కనిపించింది. దీంతో బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తరచూ స్వీట్హౌజ్లు, హోటళ్లతో పాటు ఇతర దుకాణాలపై నిత్యం తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయని, అధికారులు ఇప్పటికై నా తనిఖీలు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రాగి తీగ, ఆయిల్ చోరీ
ముధోల్ : మండలంలోని ఎడ్బిడ్ గ్రామం నుండి ఎడ్బిడ్ తండాకు వెళ్లే రహదారిలో చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి తీగ, ఆయిల్ దొంగిలించారు. ఈ ఘటనతో రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


