కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహణ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక సమావేశ నిర్వహణ అసాధ్యంగానే మారుతోంది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం హైకోర్టును ఆశ్రయించడం సమావేశ నిర్వహణను జఠిలం చేసింది. సమావేశం నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు తొలుత హైకోర్టును ఆశ్రయించగా నెల రోజుల్లోపు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలంటూ తీర్పునిచ్చింది. దీంతో సమావేశం నిర్వహణపై వారిలో ఆశలు రేకెత్తాయి. సమావేశ నిర్వహణకు చైర్పర్సన్ తేదీని ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఆమె జాప్యం చేయడంతో మున్సిపల్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం నిర్వహించాలంటూ కలెక్టర్ ఓ సర్క్యులర్ జారీ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల పక్షాన మాజీ కౌన్సిలర్, కోఆప్షన్ పదవిని ఆశిస్తున్న ఎంఐఎంకు చెందిన షానావాజ్ హుస్సేన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక సమావేశం నిర్వహించే పరిస్థితులు స్థానికంగా లేవని ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నాలుగు వారాల పాటు గడువు విధించింది. దీంతో సమావేశం నిర్వహణపై బీజేపీ సభ్యుల్లో నెలకొన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.


