ఆ ట్రిపుల్‌ఐటీలో అస‌లేం జ‌రుగుతుంది? విద్యార్థిది హ‌త్యా! లేక మ‌రేంటి? | - | Sakshi
Sakshi News home page

ఆ ట్రిపుల్‌ఐటీలో అస‌లేం జ‌రుగుతుంది? విద్యార్థిది హ‌త్యా! లేక మ‌రేంటి?

Nov 27 2023 12:16 AM | Updated on Nov 27 2023 10:42 AM

- - Sakshi

రామాటి ప్రవీణ్‌కుమార్‌ విద్యార్థి మృతదేహం

సాక్షి, ఆదిలాబాద్‌: బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్‌కుమార్‌(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్‌ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు.

ఔట్‌పాస్‌ తీసుకుని..
ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్‌ శనివారం ఔట్‌పాస్‌ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్‌పాస్‌ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్‌పాస్‌ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్‌పాస్‌ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఖాళీ గదిలో ఆత్మహత్య..
ప్రవీణ్‌కుమార్‌ బీహెచ్‌–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్‌–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు.

పోలీసు భద్రత..
విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు.

వ్యక్తిగత కారణాలతోనే..
నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్‌కుమార్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్‌పాస్‌ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్‌–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్‌ వెంకటరమణ, వీసీ

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి కూడా చదవండి: అడ‌విలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాత‌కంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement