breaking news
Ramanamurthy Mantha
-
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్ఫామ్స్లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై పీబీ ఫిన్టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్ఫామ్పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్కు పీబీ ఫిన్టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్లో కేవలం జాబ్ పోర్టల్గా మిగిలిపోకుండా రెజ్యుమ్లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్ఫామ్గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్లో కూడా ప్రాపర్టీ సెర్చ్లో ఏఐ హోమ్ అడ్వయిజర్ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్కు అడ్రస్గా నిలిచిన జస్ట్ డయల్కు అర్బన్కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్ఫామ్గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్ట్రేడ్కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్ఫామ్గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్పీరియన్స్లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్ప్లేస్లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు. పాలసీ బజార్ ఫిన్టెక్, ఆరమ్ ప్రాప్టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్వాచ్లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్వాచ్లు, స్పోర్ట్స్వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్పూల్స్, పూర్తిస్థాయి జిమ్లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్కో, వాకింగ్కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్వేర్, బాటా, రిలాక్సో ఫుట్వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్లు. రెండు యాక్టివ్ లైఫ్స్టయిల్ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్ఫిట్ జిమ్లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
మార్కెట్ తడబడ్డా... ఐపీఓలు అదుర్స్
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు మొదలుపెట్టేంత వరకూ భారత మార్కెట్లు బాగానే ఉన్నాయి. పైపెచ్చు జీవితకాల గరిష్ట స్థాయిలకు అటూఇటుగా ఉన్నాయి. బుల్ మార్కెట్ మంచి జోరుమీద ఉండటంతో అప్పటిదాకా వచ్చిన ఐపీఓలకు ఏకంగా 100 రెట్లు, 200 రెట్లు స్థాయిలో స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో అయితే ఏ ఐపీఓకైనా 100 రెట్లకు తక్కువ స్పందన రాలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అలాంటి స్పందన వచ్చిన ఐపీఓలు కూడా కొన్ని పేలవంగా లిస్టయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. కాకపోతే ఇరాన్పై దాడులు మొదలయ్యాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మార్కెట్లు కిందపడ్డాయి. కంపెనీలు ఐపీఓలకు రావటానికే ఇష్టపడలేదు. కొన్ని కంపెనీలు అప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తిచేసుకుని ఉండటంతో పబ్లిక్ ఇష్యూకు రాక తప్పలేదు. కాకపోతే వాటికి రిటైలర్ల నుంచి వచ్చిన స్పందన నామమాత్రమే. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్ర్స్కయిబ్ కూడా కాలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసుకోవచ్చు. విచిత్రమేంటో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన 6 ఐపీఓల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లాభాలే ఇచ్చాయి. కొన్నయితే ఈ నాలుగు నెలల్లోనే 40–50 శాతానికి పైగా పెరిగాయి. వీటిలో కొన్ని షేర్లయితే లిస్టింగ్ నాడు పెద్దగా లాభాలివ్వకపోయినా... ఆ తరవాత క్రమంగా పెరుగుతూ చక్కటి లాభాలిచ్చాయి. దీనర్థం ఒక్కటే... సబ్ స్క్రిప్షన్ తక్కువయినంత మాత్రాన, లిస్టింగ్ లాభాలు రానంత మాత్రాన ఆ షేర్లు రాణించవని కాదు. మెల్లగా ముందుకెళుతూ అద్భుతమైన రాబడినిస్తాయనేది ఈ షేర్లు చెబుతున్న వాస్తవం. ఆ వివరాలే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై సందేహాలు... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది ‘మెయిన్ బోర్డు’ ఐపీఓ మార్కెట్ అద్భుతమైన నిలకడ చూపించింది. మార్చి–2026 తరువాత మార్కెట్లోకి వచ్చిన ఆరు ప్రధాన ఐపీఓల్లో ఐదు ఇప్పటికీ ఇష్యూ ధర కంటే ఎగువన ట్రేడవుతుండగా... ఒక్క అమీర్ చంద్ జగదీశ్ కుమార్ ఎక్స్పోర్ట్స్’ మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువన కొనసాగుతోంది.ఈ మూడూ... 40 శాతానికిపైనే ఇప్పటివరకు అత్యధిక రాబడినిచ్చిన ఐపీఓగా హెక్సగాన్ న్యూట్రిషన్ నిలిచింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 55 శాతం లాభాన్ని అందించింది. ఆ తర్వాత పవరికా (44 శాతం), సాయి పేరెంటరల్స్ (42 శాతం) టాప్–2, 3, స్థానాల్లో నిలిచాయి. ఏప్రిల్ తరువాత లిస్టయి ఈ మూడు షేర్లూ మూడు 40 శాతానికి పైగా లాభాలివ్వటం గమనార్హం. వీటిలో సాయి పేరెంటరల్స్ హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ కావటం విశేషం. లిస్టయిన తరువాత కంపెనీ వెలువరించిన 2025 క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో ఒకస్థాయిలో షేరు ధర రూ.600 కూడా దాటింది. అత్యధిక లాభాలు అందించిన హెక్సగాన్ కూడా ఫార్మా కంపెనీయే కాగా... పవరికా మొదట్లో తడబడినా ఆ తరువాత డేటాసెంటర్ల బూమ్తో ఒక్క నెలలోనే 50 శాతానికిపైగా పెరగటం గమనార్హం. ఒబెరాయ్ల కుటుంబానికి చెందిన ఈ కంపెనీ పవన విద్యుదుత్పత్తితో పాటు డేటా సెంటర్లకు భారీ స్థాయి జనరేటర్లను సమకూర్చే వ్యాపారంలో ఉంది. సబ్ స్క్రిప్షన్ ఎక్కువైతే... లాభాలూ ఎక్కువేనా?ఈ ఐపీఓలు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. పవరికాకు కేవలం 1.45 రెట్లు మాత్రమే సబ్ స్క్రిప్షన్ లభించింది. అయినప్పటికీ అది 44 శాతం రాబడితో అగ్రగాముల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు నాక్ ప్యాకేజింగ్కు 87 రెట్లు, హెక్సాగాన్కు 54 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. కాకపోతే వీటి రాబడులు మాత్రం ఒకేలా లేవు. అమీర్ చంద్ జగదీశ్కుమార్ ఎక్స్పోర్ట్స్’కు పవరికా కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఇప్పటికీ ఇష్యూ ధర కంటే దిగువనే ట్రేడవుతోంది. అంటే సబ్ స్క్రిప్షన్ సంఖ్య మాత్రమే షేర్ల రాబడులను నిర్ణయించదని ఈ ఐపీఓలు స్పష్టం చేశాయి.ఈ ఐపీఓలు చెప్పిన పాఠాలివీ..→ లిస్టింగ్ రోజున వచ్చే హైప్ శాశ్వతం కాదు. → భారీ సబ్ స్క్రిప్షన్ అంటే భారీ లాభాలు అన్న గ్యారంటీ లేదు. → చివరికి కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి, మార్కెట్ నమ్మకమే పెట్టుబడిదారుల సంపదను నిర్ణయిస్తాయి. - మంథా రమణమూర్తి -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! -మంథా రమణమూర్తి -
ఐటీ విజేతలు మారుతున్నాయ్
ఒక స్టార్టప్. రెండేళ్ల కిందట దాని వార్షికాదాయం 10 కోట్ల డాలర్లు. మరిప్పుడు? ఏకంగా 3 వేల కోట్ల డాలర్లకు చేరబోతోంది. అమెరికన్ సిలికాన్ వాలీ దీన్ని పండగ చేసుకుంటుంటే... భారత ఐటీ రంగం వణికిపోతోంది. మన స్టాక్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఏంటా స్టార్టప్? మన మార్కెట్లతో సంబంధమేంటి? మన ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్ స్టోరీ. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు గడిచిన ఏడాదిలో 30 శాతం పడిపోయింది. ఐదేళ్ల దీర్ఘకాలాన్ని తీసుకున్నా నెగెటివ్ రిటర్న్లే చూపిస్తోంది. కారణం... 2004లో లిస్టయిన తరవాత తొలిసారిగా ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో వృద్ధి లేదు. పైగా క్షీణించింది. మరో దిగ్గజం ఇన్ఫోసిస్.. వచ్చే ఏడాది తమ ఆదాయ వృద్ధి 1.5 నుంచి 3 శాతాన్ని మించకపోవచ్చంటూ బలహీనమైన గైడెన్స్ ఇచ్చింది. వీటన్నిటినీ మించి ఐటీ రంగంలో హైరింగ్ దారుణంగా పడిపోయింది. వీటన్నిటికీ కారణం... ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్. సిలికాన్ వాలీ పండగ చేసుకుంటున్నది కూడా ఆంత్రోపిక్ అనే ఏఐ అద్భుతాన్ని చూసి. మన మార్కెట్లను భయపెడుతున్నది కూడా ఈ ఏఐనే. మరిపుడు మన ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? మన ఐటీ స్టోరీ ముగిసినట్లేనా?ఇది ముగింపు కాదు... కొత్త ఆరంభందీన్ని మన ఐటీ రంగం కథ ముగిసినట్లు కాకుండా కొత్త కథ ఆరంభంగా చూడాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ మన దేశంలోనూ కొత్త విజేతల్ని తయారు చేస్తోంది. ఏఐ ఇంజనీరింగ్, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఇండ్రస్టియల్ ఏఐ, చిప్ తయారీ వ్యవస్థలకు సంబంధించిన కంపెనీలు మెల్లగా వెలుగులోకి వస్తు న్నాయి. ఈ కొత్త కంపెనీల రేస్ ఇప్పటికే మొదలైంది కూడా. ఆంత్రోపిక్ వేగానికి తీసిపోకుండా!!. ఉద్యోగాలు రిస్కులో ఉన్నట్లేనా?ఐటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రంగంలో కొన్ని విభాగాల ఉద్యోగులు డేంజర్ జోన్లోకి వచ్చేశారు. ఆయా కంపెనీలు ఏఐని వాడటం మొదలుపెట్టే కొద్దీ వీరి అవసరం, ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది కనక... ఇప్పుడు కాకుంటే కొన్నాళ్ల తరవాత అయినా వీరి ఉద్యోగం ప్రమాదంలో పడొచ్చన్నది నిపుణుల మాట. ప్రధానంగా టెస్టింగ్, బేసిక్ కోడింగ్, సపోర్టింగ్ రోల్స్లో ఉండేవారు, డాక్యుమెంటేషన్ చేసేవారు, బీపీఓ వాయిస్ ప్రాసెసింగ్లో ఉండేవారు ఈ ప్రమాదాన్ని త్వరగా ఎదుర్కొంటారనేది ఏఐ నిపుణుల వార్నింగ్.టెస్టింగ్, డాక్యుమెంటేషన్, వాయిస్ ప్రాసెసింగ్ వంటి ఏఐ చేసే పనుల్లో ఉన్నవారు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ... ఏఐ ఇంటిగ్రేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రా, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాలలో భారీగా కొత్త ఉద్యోగాలు పుట్టుకు రాబోతున్నాయనే ది నిపుణుల మాట. ఎందుకంటే ఏఐ వాడకం పెరుగుతున్న కొద్దీ వీరి అవసరం కూడా పెరుగుతుంది. పైపెచ్చు ఏఐ వాడటంలో ఎదుర య్యే సవాళ్ల నుంచి మరిన్ని విభాగాలు పు ట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. సరే... ఇ దంతా ఉద్యోగాల గురించి అనుకుందాం. మరి కంపెనీల మాటేంటి? ఇన్వెస్టర్ల సంగతేంటి? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు వీక్ గైడెన్స్, డీల్స్ నెమ్మదించటం, వృద్ధి తగ్గిపోవటం వంటి కారణాల వల్ల ఇప్పటికే బాగా నష్టపోయాయి. కాకపోతే కొన్ని మధ్య తరహా ఐటీ కంపెనీలు, ఏఐపై దృష్టి పెట్టిన కంపెనీలు ఈ పతనాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఏఐని వేగంగా అందుకోవటం, పాత కాలపు కాంట్రాక్టులను తగ్గించుకోవటం, డిజిటల్పై ఎక్కువగా దృష్టి పెట్టడం వీటిని కొత్త విజేతలుగా మారుస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో కొన్ని...పర్సిస్టెంట్ సిస్టమ్స్: బలమైన ఏఐ, క్లౌడ్-డిజిటల్ ఇంజినీరింగ్ఎల్టీఎం (మైండ్ట్రీ): ఏఐ ఆధారిత మార్పును త్వరగా అందుకోవటంకోఫోర్జ్: డిజిటల్పై ఫోకస్, ప్రత్యేకమైన నైపుణ్యంఎంఫసిస్: బీఎఫ్ఎస్ఐ + క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ కేపీఐటీ: ఆటో సాఫ్ట్వేర్ + ఎంబెడెడ్ సిస్టమ్స్ఏఐ దిశగా జరుగుతున్న మార్పుల్లో కొన్ని మధ్యశ్రేణి కంపెనీలు దిగ్గజాల్ని మించి పెరిగే అవకాశముందన్నది విశ్లేషకుల మాట. భవిష్యత్ విజేతలు ఇవేనా..?ఏఐ ఇన్ఫ్రా రంగంలోని కంపెనీలు డేటా సెంటర్లు, జీపీయూలు, క్లౌడ్ ఇన్ఫ్రా, నెట్వర్కింగ్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్లోని సంస్థలు ఈ పరిధిలోకి వస్తాయి. నెట్వెబ్ టెక్నాలజీస్, తేజస్ నెట్వర్క్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, కేనెస్ టెక్నాలజీ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి.ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కంపెనీలు ఏఐ వృద్ధి చెందాలంటే దానికి చిప్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ కావాలి. కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఎలెక్సీ, సైయంట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ కంపెనీలు ఏఐని ఉపయోగించటం పెరుగుతున్న కొద్దీ ఏఐ సెక్యూరిటీ, అమలు, గవర్నెన్స్, ఆడిట్ సిస్టమ్స్ వేగంగా పెరగాల్సిన అవసరముంది. దీంతో పాటు వెండర్లకు పనులు ఔట్సోర్సింగ్పై ఇవ్వటం కన్నా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అవసరం పెరుగుతుంది. మొత్తం ప్రాజెక్టుల్ని ఔట్సోర్సింగ్కి ఇచ్చే బదులు భారత కంపెనీలు నేరుగా ఏఐ టీమ్స్ను తయారు చేసుకోవటం మొదలుపెడతాయి. వీటిని ఏ కంపెనీలు త్వరగా అందిపుచ్చుకుంటే అవి విజేతలుగా మారతాయి.దీన్నిబట్టి అర్థమయ్యేది ఒక్కటే. భారత ఐటీ రంగం రికవరీ కాకుండా పోదు. కాకపోతే మునుపటిలా కాదు. ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందనే మాదిరి కాకుండా ఏఐని ఎక్కువగా ఏ కంపెనీలైతే అందిపుచ్చుకుంటాయో అవి వేగంగా పెరుగుతాయి. కొత్త ఐటీ విజేతలు పుట్టుకొస్తాయి. పాత మోడల్...ఎక్కువమంది ఉద్యోగులంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎన్ని గంటలు పనిచేస్తే అంత బిల్లింగ్. అంటే ఇక్కడ సమయానికే విలువ. పెద్ద పెద్ద క్యాంపస్లు తప్పనిసరి. క్యాంపస్ సైజును బట్టే కంపెనీకి విలువ.యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్లకు వెళ్లి ఫ్రెషర్స్ను తీసుకోవటం సంప్రదాయం. కొత్త విజేతల తీరు...ఏఐ ప్రొడక్టివిటీని ఎంత పెంచితే... రెవెన్యూ అంత పెరుగుతుంది. ఫలితాన్ని బట్టే బిల్లింగ్. ఆ పనిని గంటల్లో చేసినా... రోజుల్లో చేసినా తేడా లేదు. చిన్న చిన్న ఏఐ టీమ్లుంటాయి. ఆ టీమ్ చేసే పనే కంపెనీ విలువను నిర్దేశిస్తుంది.ఆన్లైన్, ఆఫ్లైన్ ఇలా ఏ విధానమైనా... ఏఐ స్పెషలిస్టుల్నే తీసుకుంటారు.- రమణమూర్తి మంథా -
ఏఐ, డ్రోన్లో ముందుంటాం
పేరు మాత్రమే కాదు. బిజినెస్ తీరునే మార్చుకుని ఆధునిక డ్రోన్, క్లౌడ్– ఏఐ సర్వేలెన్స్ రంగాల్లో వడివడిగా అడుగులేస్తున్న మగెలానిక్ క్లౌడ్ది నిన్నటిదాకా స్టోరీనే. ఇపుడు ఆ స్టోరీ కార్యాచరణలోకి వస్తోంది. తాజాగా రైల్వే సహా పలు బ్యాంకింగ్ సంస్థల నుంచి సర్వేలెన్స్ కాంట్రాక్టులు దక్కించుకుంది. డ్రోన్ల తయారీలోకి ప్రవేశించాక డిఫెన్స్ నుంచీ కాంట్రాక్టులు దక్కాయి. తమ ప్రణాళికలు పూర్తిగా ఆచరణలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చంటున్న కంపెనీ సీఎండీ జోసెఫ్ సుదీర్(జో)తో ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ...మీ బిజినెస్ వర్టికల్స్లో ఆదాయం పరంగా ముందున్నవేంటి?ఇప్పుడైతే స్టాఫింగ్, ఐటీ సేవలనేవి మొదటి వరుసలో నిలుస్తాయి. ఏఐ–ఇన్నోవేషన్పై ఫోకస్ చేస్తుంది. ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ను రూపొందిస్తున్నాం. రెవెన్యూ పరంగా దీనిదిపుడు రెండో స్థానం. డ్రోన్ తయారీలోకి కూడా ప్రవేశించాం. లాజిస్టిక్స్, డిఫెన్స్, కమర్షియల్ సర్వీసుల కోసం కస్టమైజ్డ్ డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇపుడైతే రెవెన్యూలో ఇది చివర్లో ఉంది. కానీ వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ ఆర్డర్ పూర్తిగా మారుతుంది. మరి ఇలా మారటానికి ఇపుడేం చేస్తున్నారు?ఇప్పుడున్న దశలో ఏది ఏ స్థాయిలో అమలవుతోందో పూర్తి వివరాలు చెప్పలేను. కానీ డైరెక్షన్ క్లియర్గా ఉంది. రెవెన్యూ పనితీరు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్ పెట్టాం. గడిచిన మూడు త్రైమాసికాలుగా వృద్ధికి ఒక బేస్ను తయారు చేసుకున్నాం. నంబర్స్ మాత్రం ఇపుడు చెప్పలేను. సరే! ఇప్పుడు మీ డ్రోన్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంది?దీనికి సంబంధించి 15–20 కోట్ల ఆర్డర్బుక్ ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్ రంగానివే. డిజైన్ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, డిప్లాయిమెంట్ వరకూ మేమే చేస్తున్నాం. అవసరాన్ని బట్టి డెలివరీకి 30–45 రోజుల నుంచి మూడు నెలల వరకూ పడుతుంది. డ్రోన్ల తయారీలోకి చాలామంది వస్తున్నారు కదా!. మీ స్పెషాలిటీ ఏంటి?మేం 200 కిలోల వరకూ పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తున్నాం. అవరోధాల్ని దాటుకుని ఆటో ల్యాండింగ్ కావటం... జీపీఎస్ లేకున్నా లక్ష్యాన్ని చేరటం... ఎల్రక్టానిక్ వార్ఫేర్ను తట్టుకోగలగటం ఈ డ్రోన్ల ప్రత్యేకత. సిగ్నల్ జామ్ అయిన సందర్భాల్లో సైతం ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థల్ని ఉపయోగించుకుని పనిచేయటం వీటి స్పెషాలిటీ.మీ రెవెన్యూలో రికరింగ్ ఎక్కువా? లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్కువా?దాదాపు 70–80 శాతం రెవెన్యూ రికరింగ్ రూపంలోనే వస్తోంది. ఇవన్నీ 3–5 ఏళ్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు. వీటివల్ల స్థిరత్వం వస్తోంది. మీ ఆర్డర్ బుక్, భవిష్యత్ వృద్ధిని వివరంగా చెబుతారా?ఈ మధ్య మేం దాదాపుగా రూ.250 కోట్ల రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నాం. వీటిలో 10 శాతాన్ని ఇప్పటిదాకా పూర్తిచేశాం. భవిష్యత్ను దీన్నిబట్టే ఊహించొచ్చు. ప్రస్తుత మార్గాల ద్వారా రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.మీ బిజినెస్లో అంతర్జాతీయ వాటా ఎంత?గతేడాది మేం రూ.600 కోట్ల రెవెన్యూ సాధించాం. దీన్లో రూ.400 కోట్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచే వచ్చింది. దీన్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చింది. అంతర్జాతీయ క్లయింట్లలో డేటా సెంటర్లు ప్రధానం. వీటికి డేటా ఇంజినీరింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందిస్తున్నాం. మీ వ్యాపారంలో ఏఐ పాత్ర ఎంతవరకూ ఉంది?అన్నిటికీ ఏఐనే ప్రధానం. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఏటీఎంలకు ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ అందిస్తున్నాం. ఆటోమేటెడ్ సర్వేలెన్స్ వ్యవస్థల్లో... రియల్టైమ్లో అలెర్ట్లు పంపటంలో... ఇంప్రూవ్మెంట్లో అన్నింట్లో ఏఐ ఉంటుంది. డ్రోన్స్, ఐటీ, సర్వేలెన్స్ ఇలా మా వెర్టికల్స్ అన్నింటా ఏఐ తప్పనిసరి. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసనమీరు ఈ మధ్య కొన్ని కంపెనీల్ని టేకోవర్ చేశారు కదా? ఫండింగ్ ఎలా?ఎక్కువ భాగం ఫండింగ్ అంతర్గత వనరుల నుంచే సమీకరించుకున్నాం. 2023–24లో మాత్రమే కొంత మూలధనం సమీకరించాం. మొత్తంగా చూస్తే బలమైన క్యాష్ ఫ్లో నుంచే ఫండింగ్ చేస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు రూ.60 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, బ్యాంకింగ్– పీఎస్యూ ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించాం. కంపెనీ వృద్ధికి సంబంధించి ఇన్వెస్టర్లు ఏం ఆశించొచ్చు?గతేడాది 600 కోట్ల రెవెన్యూ ఉంది. ఈ ఏడాది రూ.850 కోట్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది వెయ్యి కోట్లు దాటాలని లక్ష్యిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో 30–50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. సేవల కంపెనీ నుంచి ప్లాట్ఫామ్ ఆధారిత, ఏఐ ఆధారిత వ్యాపారంగా ఎదుగుతున్నాం కనక ఇన్వెస్టర్లు కూడా మంచి వృద్ధిని ఆశించొచ్చు.-రమణమూర్తి మంథా -
ఇన్వెస్టర్లూ పారాహుషార్!!
స్టాక్ మార్కెట్లో తరచూ కొన్ని థీమ్లు మెరుస్తాయి. భవిష్యత్తు అద్భుతమంటూ బ్రోకరేజ్ కంపెనీలు కొన్ని రంగాల స్టోరీలు తెరపైకి తెస్తాయి. మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వ ఫోకస్, కంపెనీలు పెట్టే ఖర్చు... వీటి ఆధారంగా ఈ స్టోరీని అల్లుతారు. వీటికి నిపుణుల సిఫారసులు తోడవుతాయి. దీంతో ఆ రంగంలోని షేర్లు దూసుకుపోతాయి. సహజంగానే ఆ రంగంలోని దిగ్గజాలు ఆ ర్యాలీని లీడ్ చేస్తూ ఉంటాయి. తమాషా ఏంటంటే... అదే థీమ్ ముసుగులో ఆ రంగానికి చెందిన చిన్నాచితకా కంపెనీలు కూడా రివ్వుమంటాయి. ఫండమెంటల్స్ ఏమాత్రం లేని షేర్లు లీడర్లను మించిపోతుంటాయి. ఇదే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆపరేటర్ల హస్తవాసితో దూసుకెళ్లే షేర్ల జోలికి చిన్న ఇన్వెస్టర్లు వెళితే... ఆ తరవాత పతనంలో అమ్ముకోవటం అంత తేలిక్కాదు. ఇదంతా ఎందుకంటే... ఇపుడు మన మార్కెట్లో డిఫెన్స్, ఏరోస్పేస్ థీమ్ నడుస్తోంది. ఏడాదిగా ఈ రంగంలోని షేర్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. షేరు పీఈ (షేరుకు ఆర్జన) ఏకంగా 150–200 దాటిపోతోంది కూడా. అంటే... ఆ కంపెనీ ఇంకో 200 ఏళ్లలో సంపాదించే ఆదాయానికి తగ్గట్టుగా ఆ షేరు ఇప్పుడే పెరిగిపోయిందన్న మాట. మరి ఇలాంటి షేర్ల విషయంలో జాగ్రత్తపడాలి కదా? అదెలాగో వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ఒకే ఒక్క ఏడాదిలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ఉన్న, ఉన్నట్లు చెబుతున్న పలు షేర్లు రెండు, మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగిపోయాయి. నిజానికి ఈ రంగం లాంగ్టర్మ్ పటిష్ఠంగానే ఉంది. కొన్ని కంపెనీల ఆర్డర్ బుక్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఒక రంగం బాగుందంటే దానర్థం ఆ రంగంలోని షేర్లను ఏ ధర పడితే ఆ ధరకు కొనొచ్చని కాదు కదా? ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదేమిటంటే మొదట స్టోరీ. దాంతో భారీగా రీ–రేటింగ్. ఫండ్లు, ఆ రంగంపై అవగాహన ఉన్నవారు, సమాచారం తెలిసినవారు ముందుగా ఆయా షేర్లు కొంటారు. ఇదంతా స్మార్ట్ మనీ. షేర్లు పెరుగుతాయి. అప్పుడు రిటైలర్లు కొంటారు. ఇంకా పెరుగుతాయి. ఇక దొరకవేమోనన్న భయంతో మరికొందరు రిటైలర్లు దూకుతారు. వేల్యుయేషన్లు పెరిగిపోతాయి. కరెక్షన్ ఆరంభం. అయితే ధర తగ్గటం... లేదా దీర్ఘకాలంపాటు అక్కడే కదలటం. ఇలా ఏ రకంగానైనా దెబ్బతినేది ఆలస్యంగా కొన్న రిటైలర్లే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలో చూద్దాం... 1. ఆర్డర్ బుక్ భారీగా ఉన్నా... → డిఫెన్స్ వ్యవహారాల్లో ఎగ్జిక్యూట్ కావటానికి దీర్ఘకాలం... అంటే 3–5 ఏళ్లు పడుతుంది. → ఎగ్జిక్యూషన్ రిస్క్లు ఎక్కువ. ఆర్డర్లన్నీ ఆచరణలోకి రాకపోవచ్చు కూడా. 2. ప్రభుత్వ ప్రీమియం పెరుగుతోంది... → చారిత్రకంగా చూస్తే ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు 10–20 పీఈ మధ్య ట్రేడయ్యేవి. → ఇపుడైతే వాటి చారిత్రక విలువల కన్నా 5–10 రెట్లు ఎక్కువ పీఈ వద్ద ట్రేడవుతున్నాయి. 2. ఆర్జనను మించి షేరు పరుగు... → ఈ కంపెనీల ఆదాయాలు ఏటా 20 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి. → కానీ ఈ కంపెనీల షేర్ల విలువ ఏడాదిలో 200–300 శాతం పెరిగిపోతోంది. ఇలాగైతే జాగ్రత్త... → స్టాక్ నిట్టనిలువుగా పెరుగుతూ వచ్చిందంటే... కొనేముందు ఆలోచించండి. → స్టాక్ ధర ఎంత ఉంది? దాని ఆదాయం ఎంత పెరుగుతోంది? అనేది చూడండి. → నిదానంగా కొనటం ముఖ్యం. ఒకేసారి మొత్తం కొంటే తరవాత కష్టం. చెయ్యాల్సిందేంటి? → కరెక్షన్ కోసం చూడండి. ఎందుకంటే షేర్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉండవు. కనీసం 30–40 శాతం తగ్గేదాకా ఎదురుచూడండి. → షేరు ధర కన్నా... కంపెనీ ఆదాయం పెరుగుదలపై ఫోకస్ పెట్టండి. → వేగంగా పెరుగుతున్న చిన్న షేర్ల కన్నా... లీడర్లపై దృష్టిపెట్టండి. లోకల్ కంపెనీల డ్రీమ్ రన్... జాగ్రత్త! తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటార్ టెక్నాలజీస్, అపోలో మైక్రో సిస్టమ్స్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బొందాడ ఇంజినీరింగ్ వంటి షేర్లు డిఫెన్స్ థీమ్తో ఇటీవల బీభత్సంగా ఎగిశాయి. ఎంటార్ షేరు ఏకంగా రెండుమూడు నెలల వ్యవధిలోనే 3–4 రెట్లు పెరిగిపోయింది. ఆదాయాలకు మించి పెరుగుతున్న ఇలాంటి షేర్లలో కరెక్షన్ వస్తే అది కూడా తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి రిటైలర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఇవీ.. డిఫెన్స్లో లీడర్లు → హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ → భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ → భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్.. హెవీ డిఫెన్స్లో → మజగన్ డాక్ షిప్బిల్డర్స లిమిటెడ్ → కొచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ → గార్డెన్రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ప్రైవేటు డిఫెన్స్ షేర్లు... (స్మాల్–మైక్రోకాప్) → డాటా పాటర్న్స్ ఇండియా → పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ → సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బాగా పెరిగిన తెలుగు రాష్ట్రాల షేర్లు → ఎంటార్ టెక్నాలజీస్ → అజాద్ ఇంజినీరింగ్ → బొందాడ ఇంజినీరింగ్ → సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (ఒకనాటి మెగాసాఫ్ట్) → అపోలో మైక్రో సిస్టమ్స్ (వీటిలో చాలా షేర్లు నిట్టనిలువుగా పెరిగినవని) పక్క పట్టిక చూస్తే 320 పీఈ వద్ద ట్రేడవుతున్న షేర్లు ఆరు నెలలు తిరక్కుండా ఆరేడు రెట్లు పెరిగిన షేర్లు కనిపిస్తాయి. నెలలోనే రెట్టింపయిన షేర్లూ ఉన్నాయి. మరి వీటి ఆదాయాలు ఆ స్థాయిలో పెరిగాయా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన జవాబు రాదు. ఆదాయాలు కొంత పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఆదాయాలకు 10 నుంచి 20 రెట్లు షేర్లు పెరిగిపోవ టమే ఆందోళనకరం. రిటైలర్లు ఇలాంటి సమయాల్లో ఇంకా పెరుగుతాయనే ఆశతో ఎంటరయితే పడిపోయే అవకాశమూ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చు. పైపెచ్చు స్టోరీ ఆధారంగా పెరిగిన షేర్లు ఆ స్టోరీ గనక నిజం కాకపోతే నేలచూపులు చూడొచ్చు. అపుడు రిటైల్ ఇన్వెస్ట ర్లు ఎంతో కొంతకు అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. నష్టాలు భారీగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని థీమ్ల వెంట పరుగులు పెట్టవద్దన్నది నిపుణుల సలహా. ఒకవేళ మీరు గనక థీమ్ను బలంగా నమ్మితే... ఆ రంగంలో లీడర్లను ఎంచుకోవాలే తప్ప చిన్నషేర్ల వెంట క్విక్ మనీ కోసం పరుగులు పెడితే ఇబ్బందులేనన్నది గ్రహించాలి. -రమణమూర్తి మంథా


