
భువనేశ్వర్: పూరీ జగన్నాథ దేవస్థానంలో స్నాన పూర్ణిమ పురస్కరించుకుని నిర్వహించే స్నానోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది.

సోదర సోదరి సమేతంగా జగన్నాథుడు స్నాన మండపంపై బహిరంగంగా భక్తజనం సమక్షంలో మహాభిషేకం ఆచరించడం ఈ ఉత్సవం విశిష్టత. ఈ వేడుక ప్రత్యక్షంగా తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.

బుధవారం తెల్లవారుజాము నుంచి మంగళహారతి మొదలుకొని ఒకొకాసొ, బింబ స్నానం వంటి దైనందిన ఆచారాల తరువాత రత్న వేదిక నుంచి మూల విరాటులను వరుస క్రమంలో (గొట్టి పొహొండి) స్నాన మండపానికి తరలించారు.

ఈ సందర్భంగా సంప్రదాయబద్ధమైన వాద్యనాదంతో శ్రీ మందిరం పరిసరాలు మారుమోగాయి. చందనం, కర్పూరం, కుంకుమ, మూలిక తైలాలు, సహజ పరిమళ ద్రవ్యాలతో ఇతరేతర సుగంధ పుష్పాది ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో నిండిన 108 కలశాల జలంతో చతుర్థా మూర్తులకు అభిషేకించారు.













