
11 నెలల వయస్సులోనే పెండ్లి చేశారు!
తప్పటగుడుల వయస్సులోనే పెండ్లి చేశారు. ఊహా తెలిసేనాటికి ఇదే నీ తలరాత.. వెళ్లి బుద్ధిగా అత్తగారింట్లో కాపురం చేసుకోమని బెదిరించారు
తప్పటగుడుల వయస్సులోనే పెండ్లి చేశారు. ఊహా తెలిసేనాటికి ఇదే నీ తలరాత.. వెళ్లి బుద్ధిగా అత్తగారింట్లో కాపురం చేసుకోమని బెదిరించారు. కానీ ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. మాటలు కూడా రాని 11 నెలల వయస్సులో చేసిన పెండ్లి పెండ్లే కాదంటూ.. తల్లిదండ్రులను, చివరకు కులపెద్దలను ఎదురించి పోరాడింది. ఎట్టకేలకు తనకు సంకెళ్లు వేయాలని చూసిన బాల్యవివాహం నుంచి విముక్తిని పొందింది. రాజస్థాన్కు 19 ఏండ్ల శాంతాదేవి మేఘ్వాల్ స్ఫూర్తిదాయక గాథ ఇది.
బాల్య వివాహాలకు దేశంలోనే పేరుమోసిన రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మూఢాచారముంది. చిన్న వయస్సులోనే ఆ రాష్ట్రంలో బాలబాలికలకు వివాహాలు చేస్తారు. అదేవిధంగా జోధ్పూర్కు చెందిన శాంతాదేవి మేఘ్వాల్కు 11 నెలల పసిప్రాయంలోనే పెండ్లి చేశారు. తొమ్మిదేళ్ల సాన్వల్ రామ్కు ఇచ్చి కట్టబెట్టారు. ఊహా తెలియని వయస్సులో తనకు జరిగిన పెళ్లి గురించి తండ్రి రెండేండ్ల కిందట శాంతాదేవికి చెప్పాడు. అప్పటికి ఆమె వయస్సు 17 ఏళ్లు. అప్పటివరకు దాచిపెట్టిన విషయాన్ని తండ్రి చల్లగా చెప్పడంతో ఆమె షాక్ తింది. అయినా ఆ పెండ్లిని అంగీకరించలేదు. అత్తగారింటికి వెళ్లాలంటూ తల్లిదండ్రులు చేసిన ఒత్తిడికి తలొగ్గలేదు.
దీంతో వరుడి కుటుంబసభ్యులు స్థానిక కులపెద్దల పంచాయతీని ఆశ్రయించింది. శాంతాదేవి చిన్నప్పుడు జరిగిన పెండ్లిని ధిక్కరించి.. తమ సంప్రదాయాన్ని కాలరాస్తున్నదని కులపెద్దలు కన్నెరజేశారు. పెండ్లికి ఒప్పుకోనందుకు రూ. 16 లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించారు. దాంతో ఇది నీ తలరాత. నువ్వు అంగీకరించాలని నా తల్లిదండ్రులు నయాన, భయాన చెప్పిచూశారు. బెదరించారు. అత్తవారింటికి వెళ్లు అని ఒత్తిడి చేశారు. అయినా బెదిరిపోని శాంతాదేవి ధైర్యంగా 'సార్థీ' అనే స్వచ్ఛంద సంస్థను కలిసింది. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కీర్తి భారతి అనే స్వచ్ఛంద కార్యకర్త 'సార్థీ' అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ సాయంతో శాంతాదేవి కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అదేవిధంగా శాంతాదేవి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించింది. దీంతో శాంతాదేవికి కుటుంబం కూడా అండగా నిలబడింది.
తనకు జరిగిన బాల్యవివాహంపై ఎంతో ధైర్యంగా పోరాడిన శాంతాదేవి ఎట్టకేలకు విజయం సాధించింది. గత మంగళవారం జోధ్పూర్ ఫ్యామిలీ కోర్టు ఈ బాల్యవివాహాన్ని రద్దు చేసింది. దీంతో కొత్త జీవితాన్ని పొందిన శాంతాదేవి భవిష్యత్తులో ఉపాధ్యాయురాలు కావాలని కోరుకుంటున్నారు. 'సార్థీ' సంస్థ రద్దు చేయించిన 29వ బాల్యవివాహం ఇది కావడం విశేషం.