
మరో బాబాయి మద్దతు పలికాడు!
యూపీ అధికార పార్టీ సమాజ్వాదీ పరివారంలో తలెత్తిన వార్ గురువారం కొత్త మలుపు తీసుకుంది.
లక్నో: యూపీ అధికార పార్టీ సమాజ్వాదీ పరివారంలో తలెత్తిన వార్ గురువారం కొత్త మలుపు తీసుకుంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను తొలగించడంతో రగిలిపోతున్న సీఎం అఖిలేశ్ యాదవ్కు కుటుంబం నుంచి మద్దతు లభించింది. బాబాయి శివ్పాల్ యాదవ్తో అమీతుమీ సిద్ధపడ్డ ఆయనకు మరో బాబాయి రాంగోపాల్ యాదవ్ అండగా నిలిచారు.
ఎస్పీ అధినేత ములాయం సింగ్కు కజిన్ సోదరుడు, రాజ్యసభ సభ్యుడైన రాంగోపాల్ గురువారం అఖిలేశ్ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అఖిలేశ్ను ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం తప్పేనని తేల్చేశారు. అఖిలేశ్కు చెప్పకుండానే ఆయన తండ్రి ములాయం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
'ముఖ్యమంత్రిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో నాయకత్వం కొంత పొరపాటు చేసింది. ఈ విషయాన్ని ముందే సీఎంకు చెప్పాల్సి ఉండేది. ఎన్నికల దృష్ట్యా సీఎం పదవిలో ఉన్న వారు రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగడం అంతగా వీలు కాదు కాబట్టి వేరే వారిని నియమిస్తున్నామని చెప్పి ఉంటే.. అఖిలేశ్ స్వయంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేవారు' అని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. అయితే, ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వివాదం తలెత్తిందని, అంతేకానీ, పార్టీలో కానీ, కుటుంబంలోని కానీ ఎలాంటి సంక్షోభం లేదని చెప్పుకొచ్చారు. ఏమైనా చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉంటే వాటిని సరిచేసుకుంటామని చెప్పారు. సీఎం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, సీఎం అన్నప్పుడు ఆ అధికారం ఉటుందని అఖిలేశ్ను ఆయన వేనకేసుకొచ్చారు.