సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్‌ | Web counselling for transparency in teachers' transfers | Sakshi
Sakshi News home page

సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్‌

Jun 26 2018 3:31 AM | Updated on Oct 2 2018 6:27 PM

Web counselling for transparency in teachers' transfers - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు.

వెబ్‌ కౌన్సెలింగ్‌లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్‌మెంట్లవారీగా బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్‌ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు.

కొందరు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్‌ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్‌ కౌన్సెలింగ్‌లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్‌ కౌన్సె లింగ్‌ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్‌కు వేల మెస్సేజ్‌ లు, వందల కాల్స్‌ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్‌ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ౖపై కొంతమంది యూనియన్‌ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

పొరపాట్లు సరిదిద్దారు..
 
టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ

స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్‌ తేదీల గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్‌కౌన్సెలింగ్‌ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్‌ఎం) వెబ్‌కౌన్సెలింగ్‌ ముగిసింది. ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్ల వెబ్‌కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్‌కౌన్సెలింగ్‌ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్‌ అసిస్టెంట్లు వెబ్‌ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్‌ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రక్రియలో వెబ్‌సైట్‌ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది.

Advertisement
 
Advertisement
Advertisement