
నోటాకు ఓటు పొరపాటు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే చెల్లదనే విషయం తమకు తెలియదని...
• రెండో ప్రాధాన్యత ఓటు చెల్లదని మాకు తెలియదు: కిషన్రెడ్డి
• రేవంత్ది తప్పే.. అంతకన్నా ఎక్కువ తప్పు టీఆర్ఎస్దే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే చెల్లదనే విషయం తమకు తెలియదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి చెప్పారు. దీనిపై ముందుగా ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వలేదని, ఎలాంటి చర్చ కూడా జరగలేదన్నారు.
ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వం నిర్వహిస్తున్న సంపర్క్ అభియాన్ శిక్షణ శిబిరానికి హాజరైన కిషన్రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నోటాకు రెండో ప్రాధాన్యత ఓటు వేయడం పొరపాటుగా జరిగిందన్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ప్రశ్నించగా, రేవంత్ను సమర్థించడంలేదని, చట్టప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పారు. రేవంత్ది ఎంత తప్పుందో అంతకన్నా ఎక్కువ తప్పు టీఆర్ఎస్ది ఉందని కిషన్రెడ్డి ఆరోపించారు.
సీఎం కేసీఆర్ మొదట్నుంచి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ కేసు నేపథ్యంలో భవిష్యత్లో టీడీపీతో సంబంధాలపై ప్రశ్నించగా.. ప్రస్తుతానికి మార్పులేవీ లేవని బదులిచ్చారు. రేవంత్ విషయమై అధినాయకత్వంతో చర్చిస్తామని చెప్పారు. కేసీఆర్ ఏడాది పాలనపై అడగ్గా.. అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత క్రమం పాటించడంలేదని విమర్శించారు.
రానున్న కాలంలోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సంయమనం, సమన్వయంతో కేంద్రాన్ని, అన్ని పార్టీలను కలుపుకొనిపోవాలని హితవుపలికారు. కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై ప్రశ్నిం చగా.. తొలుత దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు ప్రధాని మోదీ స్ఫూర్తిని కేసీఆర్ అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీలో గజం భూమి పోయినా విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని చెప్పారు.
హైదరాబాద్లో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో హైదరాబాద్కు రానున్నారని కిషన్రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యులతో సమావేశమవనున్నారని చెప్పారు.