రెడీ!

Voter List Ready For Panchayat Elections - Sakshi

పంచాయతీ ఎన్నికలనిర్వహణకు అడుగులు

వార్డులు, ఓటర్ల విభజనకునోటిఫికేషన్‌

మే 17న తుది జాబితా విడుదల

జిల్లా అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

కర్ణాటక నుంచి చేరుకున్న  4,685 బ్యాలెట్‌ బాక్సులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌):  వచ్చే ఆగస్టు నాటికి గ్రామపంచాయతీ పాలకవర్గాల పద వీకాలం ముగియనుంది.. అయితే, అంతకు ముందే లేదా ఆ వెంటనే ఎన్నికలు నిర్వహి స్తారా? లేక ఆలస్యమవుతుందా? అంటూ ఇంతకాలం ఉన్న అనుమానాలకు తెరపడినట్లే! అధికారుల హడావుడి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పరిశీలిస్తే నిర్ణీత సమయంలోగానే ఎన్నికలు జరుగుతాయని భావించాల్సి వస్తోంది.. పంచాయతీల వారీగా వార్డులు, ఓటర్లను విభజించి జాబితాలు రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో గత కొంత కాలంగా ఉన్న ఉత్కంఠతకు తెర పడినట్లయింది. 2013 ఆగస్టు 2వ తేదీన పాలకవర్గాలు ఏర్పడిన విషయం విదితమే. గడువులోగా ఎన్నికలు పూర్తి చేసి పాత పాలకవర్గాల పదవీకాలం ముగియనేగా కొత్త పాలకవర్గాలు కొలువు దీరేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుండగా.. ఆ మేరకు ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కొత్త, పాత పంచాయతీలకు కలిపి ఒకే సారి ఎన్నికలునిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఓటర్ల జాబితా
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీన గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారు. మే 1వ తేదీన గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై జాబితాలపై చర్చించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 3వ వ తేదీన మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించచాక మే 1నుంచి 8వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వార్డు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 10వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సరిచేశాక 17వ తేదీన తుది ఓటరు జాబితాలను విడుదల చేయనున్నారు. 

జాబితా తయారీకి కసరత్తు...
ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాగం ఓటర్ల వివ రాల సేకరణలో నిమగ్నమైంది. ఇప్పటికే ఓటరు న మోదు ప్రక్రియ కొనసాగుతుండగా ఎన్నికల నాటికి పూర్తి ఓటరు జాబితా విడుదల కానుంది. కాగా, 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్న అధికార, విపక్ష పార్టీలకు సర్పంచ్‌ ఎన్నికలు కీలకం కానున్నాయి. గ్రామ స్థాయి నుంచే ప్రజల మద్దతు కూడగట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లోపు బలపడాలని భావిస్తున్నారు.

265 కొత్త పంచాయతీలు
జిల్లాలో కొత్తగా 265 పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 468 పంచాయతీలు ఉండగా.. 500 జనాభా ఉన్న ఆవాసాలు, తండాలను పంచాయతీలుగా ఏ ర్పాటుచేస్తూ ఇటీవల అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమో దించారు. దీంతో జిల్లాలోని గ్రామపంచాయతీల సంఖ్య 733కు చేరింది. గ్రామ సరిహద్దు లు, జనాభా, సర్వే నంబర్లు ఇతర అంశాల ఆధారం గా వార్డులు, ఓటర్ల జాబితాలు విభజించనున్నారు.

కర్ణాటక నుంచి బ్యాలెట్‌ బాక్సులు
గ్రామపంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ కోసం సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి బ్యాలెట్‌ బాక్సులు తెప్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు 4,685 బ్యాలెట్‌ బాక్సులు చేరుకోగా జిల్లా కేంద్రంలోని కొత్త గంజ్‌లో ఉన్న గోదాంలో భద్రపరిచారు. జిల్లాలో మరో మూడు వేల బాక్సులు ఉండగా.. వాటన్నింటికీ మరమత్తులు చేయిస్తున్నారు. కాగా, 733 పంచాయతీల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతున్న అధికారులు.. రెండు లేదా మూడు విడతల్లో జరగొచ్చని చెబుతున్నారు.

12 శాఖల ఉద్యోగుల వివరాలు సేకరణ...
ఎన్నికల విధుల కోసం మానవ వనరుల వివరాలను సేకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. దీంతో వివిధ శాఖల్లో ఉ ద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 12 శాఖల ఉద్యోగుల వివరాలను సకరరి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు.

ఓటర్లు, వార్డుల విభజనకు నోటిఫికేషన్‌
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: నూతన గ్రామపంచాయితీల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. ప్రక్రియను పూర్తి చేసి మే 17న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నిక ల కమిషనర్‌ నాగిరెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులకు మార్గనిర్దేశం చేశా రు. నూతనంగా ఏర్పడిన జీపీల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి ఓటర్ల జాబితాలు రూపొందించాలని, వారానికోసారి జిల్లా, ప్రతీరోజు మండ ల స్థాయిలో సమీక్షించుకోవాలని సూచించారు.

ఈనెల 30న డ్రాఫ్ట్, మే 17న తుది జాబితాలు
వార్డుల విభజన వివరాలతో పాటు ఫొటో ఎలక్టోరల్‌ డ్రాఫ్టులను గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి సూచించారు. డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ను విడుదల చేసిన అనంతరం మే 1న జిల్లా స్థాయిలో పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి నూతన గ్రామపంచాయతీల వారీగా వార్డులు, ఓటర్ల జాబితాల విభజనపై చర్చించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు మే 3న సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వార్డుల వారీగా డ్రాఫ్టు ఓటర్ల జాబితాలపై మే 1 నుండి 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను మే 10న పరిశీలించాలని సూచించారు. వార్డుల వారీగా రూపొందించిన ఫొటో ఎన్నికల జాబితాలను డీపీఓ ద్వారా గ్రామపంచాయతీల్లో ఫైనల్‌ పబ్లికేషన్‌ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌.. జిల్లాలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లోకార్యదర్శుల కొరత, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తెచ్చారు. వీసీకి కలెక్టర్‌తోపాటు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top