తొలి పరీక్ష | Telangana Panchayat Elections Warangal Politics | Sakshi
Sakshi News home page

తొలి పరీక్ష

Jan 4 2019 12:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

Telangana Panchayat Elections Warangal Politics - Sakshi

నియోజకవర్గంలో ఎక్కువ శాతం సర్పంచ్‌పదవులు మన పార్టీ వారే గెలువాలె. అట్లయితెనే అధిష్టానం దృష్టిలో మనకు మంచి పేరుంటది. వీలైనంతవరకు ఏకగ్రీవం చేద్దాం.. కాకుంటే ఎలాగైనా గెలిచి తీరాలి.. ఇది మనప్రతిష్టకు సంబంధించిన సమస్య.. కార్యకర్తల సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఓ  ఎమ్మెల్యే అన్న మాటలు..

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసి నెల రోజులు కూడా కాకముందే ‘పంచాయతీ’ హడావుడి మొదలు కావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు తొలి పరీక్ష ఎదురుకానుంది. మెజార్టీ పంచాయతీల గెలుపు.. ప్రతిష్టకు లెంకపెడుతుండడంతో శాసనసభ్యులందరూ సవాల్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇందులో 10 సీట్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. రెండు స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఉన్నాయి. నూతనంగా ఎమ్మెల్యేలైన తర్వాత 20 రోజులకే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
 
కసరత్తును ప్రారంభించిన టీఆర్‌ఎస్‌..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడొంతుల గ్రామ పంచాయతీలు కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలు సైతం పలు నియోజకవర్గాలో గ్రామాల పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ నుంచి వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. భూపాలపల్లి, ములుగులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయినా వారే నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలు సర్పంచ్‌ ఎన్నికల్లో విజయం కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

పార్టీ కేడర్‌ బలంగా ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క గ్రామం చేజారి పోకుండా చూడాలని రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర నేతలు సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల స్థానాలు ఓడిపోయినా స్థానికంలో విజయం సాధించాలని దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు దఫాల్లో ఎన్నికలు జరగనుండడంతో మొదటి విడతలో జరిగే మండలాల్లో ఈ నెల 7 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. దీంతో వరుసక్రమంలో జరిగే మండలాలపై దృష్టి పెట్టాలని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపునిచ్చి వారికే సీటు ఇవ్వాలని కొందరు ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. ఏ అభ్యర్థిని బరిలో దింపితే గెలుస్తారని అప్పుడే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఎంపికలు షురూ చేస్తున్నారు.

పట్టు కోసం కాంగ్రెస్‌ నజర్‌.. 
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్థానికంలో రిపీట్‌ కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరొందిన గ్రామాలు, పట్టున్న గ్రామాలపై కాంగ్రెస్‌ నేతలు నజర్‌ పెట్టారని తెలిసింది. భూపాలపల్లి, ములుగులో గెలిచిన ఎమ్మెల్యేలు అదే జోరు కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని పంచాయతీల్లో గెలుపు ద్వారా మరిపించాలని, తద్వారా కేడర్‌లో జోష్‌ నింపాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమిపాలైన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రజలతో అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలు సవాల్‌గా మారాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement