Telangana High Court Approves Anticipatory Bail to Former TV9 CEO Ravi Prakash | రవిప్రకాశ్‌‌కు హైకోర్ట్‌లో ఊరట - Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌‌కు హైకోర్ట్‌లో ఊరట

Jul 17 2020 1:00 PM | Updated on Jul 17 2020 5:23 PM

Telangana High Court Has Granted Bail To Ravi Prakash  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో రవిప్రకాష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు శుక్రవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌ను అనుమతులు లేకుండా విత్‌డ్రా చేసిన కేసులో గ‌తంలోనే తెలంగాణ హైకోర్టు పోలీసుల‌కు స్టే ఆర్డ‌ర్ ఇచ్చింది. తాజాగా తిరిగి అదే కేసును తెర మీద‌కు తీసుకురావ‌డంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈడీ అరెస్ట్ చేయడానికి వీలులేకుండా హైకోర్టు ర‌విప్ర‌కాష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా గతంలో టీవీ9 అసోసియేటెడ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి అనుమతులు లేకుండా రవిప్రకాశ్ భారీగా నిధులను విత్‌ డ్రా చేయడంతో ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకూ 18 కోట్ల రూపాయల నిధులను రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు విత్‌ డ్రా చేశారని కేసు నమోదు కావడంతో దానిపై విచారణ చేపట్టారు. గతంలోనే ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో సహా పలువురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్‌ విత్‌ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు.
(రవిప్రకాశ్‌పై ఈడీ కేసు నమోదు)

Advertisement
 
Advertisement
Advertisement